జూ. ఎన్టీఆర్తో నారా లోకేష్ చర్చలు విఫలం?
హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్తో సయోధ్యకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ప్రయత్నాలు విఫలమయ్యాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది. తాజా పరిణాలు దానికి అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన యువతరాన్ని ఒక తాటికి మీదికి తేవడానికి నారా లోకేష్ ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా ఆయన వారితో సమావేశాలు కూడా నిర్వహించారు.
లోకేష్ నిర్వహించిన సమావేశాలకు జూనియర్ ఎన్టీఆర్ రాలేదని సమాచారం. అయితే, జూనియర్తో సయోధ్యకు మాత్రం ఆయన విడిగా ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. ఇందుకుగాను, నందమూరి హరికృష్ణతో నారా లోకేష్ గతంలో సమావేశమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. చంద్రబాబు తీరు పట్ల హరికృష్ణ నారా లోకేష్ వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా అప్పట్లో ప్రచారం సాగింది.
అయనా, నారా లోకేష్ తన ప్రయత్నాలను విరమించలేదని చెప్పారు. ఓ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు చెబుతారు. కానీ, చివరకు ఆ చర్చలు కొలిక్కి రాలేదని అంటున్నారు. అందుకే, చంద్రబాబు నాయుడు తాను చేపట్టిన ప్రజా గర్జన సభలకు హరికృష్ణను ఆహ్వానించలేదని సమాచారం.
చంద్రబాబు తీరు పట్ల నందమూరి హరికృష్ణ ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. హరికృష్ణ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది తెలియదు. ఆయన కార్యాచరణ తెలిస్తే తప్ప జూనియర్ ఎన్టీఆర్ ఎటు వైపు ఉంటారనేది తేలదని చెబుతున్నారు.