బిజెపికి షాక్: చిద్దూ తనయుడితో రజనీకాంత్ భేటీ
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంతరంగం ఎవరికీ బోధపడడం లేదు. ఇంతకు ముందు జైలు పాలైన జయలలితకు సానుభూతి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన ఆయన తాజాగా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు చిదంబరం తనయుడు కార్తితో భేటీ అయ్యారు. ఆయన బిజెపికి షాక్ ఇచ్చేందుకు సిద్ధపడ్డారంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఉత్తరాదిన ఓ వెలుగు వెలుగుతున్న బిజెపి దక్షిణాదిలో మాత్రం పాగా వేయడానికి నానా చిక్కులను ఎదుర్కుంటున్నారు. కర్నాటకలో గతంలో పాగా వేసినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మైండ్ గేమ్తో చేతులారా పీఠాన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు వారి చూపు దక్షిణాదిలో అత్యధిక పార్లమెంటు స్థానాలు కలిగిన తమిళనాడుపై పడింది. మరీ ఇప్పుడు జయలలిత కోర్టు కేసుల్లో ఇరుక్కుని విలవిలలాడుతుండగా, డీఎంకే దిక్కూ దివానం లేనట్లుగా ఉంది.
ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవాలని బిజెపి నేతలు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ను తమతో కలుపుకుని అనుకున్నది సాధించాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ రజనీకాంత్ మాత్రం తనదైన శైలిలో వ్యవహరిస్తూ వారికి ఎంతమాత్రం అర్థం కావడంలేదు.
మాజీ ముఖ్యమంత్రి ఆస్తుల కేసులో బెయిలుపై తిరిగి రాగానే అందరికంటే ముందుగా ఓ ఉత్తరం రాశారు. ఆమె ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ కోరుకున్నారు. దాన్ని అంతగా పట్టించుకోకుండా రజనీకాంత్పై ఆశలు అలాగే పెట్టుకుంది.
అయితే, తాజాగా రజనీకాంత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గత యూపీఎలో హోంమంత్రిగా చేసిన చిదంబరం కుమారుడు కార్తీని పిలుపించుకుని చర్చలు జరపడంతో బిజెపి నాయకులు కంగు తిన్నట్లు చెబుతున్నారు. రజనీ వైఖరితో బిజెపి నేతలు విసిగి వేసారి పోయినట్లు సమాచారం. ఇక రజనీకాంత్ ఊసే ఎత్తకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు.
ఇకనైనా రజనీకాంత్ జపం చేయడం మానేయండి అంటూ సుబ్రహ్మణ్య స్వామి బిజెపి రాష్ట్ర నాయకులకు సూచన చేశారు. మొత్తమ్మీద రజనీకాంత్ వ్యవహారం బిజెపికి మింగుడుపడటంలేదు. మరి దక్షిణాది తమిళనాడులో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎలాంటి వ్యూహరచన చేస్తారో వేచి చూడాల్సిందే.