కవితపై చర్యలేవి, రాళ్లతో కొట్టాలి: రేవంత్ నిలదీత
హైదరాబాద్: మంగళవారం నాడు శాసన సభలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే పైన కేసీఆర్ గవర్నమెంటును నిలదీశారు. రెండుచోట్ల సర్వే వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, కానీ, ఎంపీ కవిత నిజామాబాద్, హైదరాబాదులలో సర్వే వివరాలు ఇచ్చిందని రేవంత్ అన్నారు. కవిత పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు.
మళ్లీ పెళ్లి చేసుకోబోమని వితంతువులు ప్రకటించాలని చెప్పడం అగౌరవపర్చడమని, ఇలాంటి ప్రభుత్వాలను నడి రోడ్డు పైన నిలబెట్టి రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం కూడా రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
సమగ్ర సర్వేనే అన్ని పథకాలకు ఆధారమంటూ తెలంగాణ ప్రభుత్వం ఊదరగొట్టిందని, దీంతో భయపడిపోయిన ప్రజలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు సైతం ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ ఈ సర్వే కోసం తమ గ్రామాలకు తరలి వచ్చారన్నారు. సమగ్ర సర్వే పేరిట రాష్ట్రాన్ని 12 గంటల పాటు నిర్బంధించారన్నారు.
సర్వే రోజు బస్సులు బంద్ చేసి, వైన్ షాపులను ఓపెన్ చేయించారన్నారు. సర్వేలో ప్రభుత్వ తప్పిదాలు చాలా ఉన్నాయన్నారు. సర్వేకి ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అందరి సలహాలు తీసుకుంటే బాగుండేదన్నారు. సర్వేనే అన్నింటికీ ఆధారం అన్నవారు, ఇప్పుడు పింఛనులు తదితర పథకాలకు మళ్లీ రకరకాల పత్రాలు తీసుకురావాలంటూ ఎందుకు వేధిస్తున్నారన్నారు.
వితంతు పింఛన్ కోసం వెళ్తే, మొగుడు చచ్చిపోయినట్టు పత్రం తీసుకురావాలంటున్నారని, ఇదెక్కడ న్యాయమన్నారు. మీరు చేసిన సర్వే తప్పుల తడక అని మీరు భావిస్తే, ఆధార్ కార్డులను ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ.. పింఛన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఆమోదయోగ్యం కాదన్నారు. సర్వే కోసం సుదూర ప్రాంతాల నుంచి లక్షలాదిమంది తరలి వచ్చారని, వారంతా సర్వేలో పాల్గొన్నారన్నారు.
ఇప్పుడు పింఛన్ల కోసం మళ్లీ సర్వే ఎందుకు చేయించారని నిలదీశారు. రకరకాల సర్వేలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. పింఛన్ దారుల నమోదులో చాలా తప్పులు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. గతంలో జారీ చేసిన రేషన్ కార్డులన్నీ సక్రమమైనవే అన్నారు.