ఒకే ఇంట్లో బుసకొట్టిన 56 పాములు
సంగారెడ్డి: మెదక్ జిల్లాలోని ఓ ఇంట్లోనివారు కనీవినీ ఎరుగని భయంకర పరిస్తితిని ఎదుర్కున్నారు. కాటేసే సర్పాల మధ్య కాపురం చేస్తున్నామని తెలుసుకుని తీవ్ర మానసికాందోళనకు గురయ్యారు.
అనుమానం వచ్చి కడపను తవ్వుతుంటే ఒక్కటి తర్వాత ఒక్కటి 56 పాములు బయటపడ్డాయి. మెదక్ జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్లోని ఓ ఇంటిలో బుధవారం ఆ పాములు బయటపడ్డాయి.
గ్రామానికి చెందిన మాచునూరి కృష్ణ ఇంటిలో వెలుగుచూసిన ఈ పాముల మంద గ్రామంలోనే కాక మండలవ్యాప్తంగా కలకలం రేపింది. కృష్ణ కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి భోజనానంతరం సుఖంగా నిద్ర పోయారు. నిద్ర నుంచి లేచి దుప్పట్లు తీసిన వారికి కృష్ణ తలదిండు కింద రెండు పాము పిల్లలు కనిపించాయి.
మరికొద్దిసేపటి తర్వాత మరో పాము కనిపించడంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. ఇరుగుపొరుగును పిలిచారు. అంతా కలిసి ఇంట్లోని వస్తువులు సర్దిచూడగా, ఇంటి ప్రధాన ద్వారంకింద నుంచి మరో మూడు పాము పిల్లలు కనిపించాయి.
దీంతో గడపను తవ్వగా 56 పాము పిల్లలు బయటకు వచ్చాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పాములను చంపి తగులబెట్టారు.