'కుమారి'ని కాదు, 'శ్రీమతి'ని: మహిళా మంత్రి ఆర్డర్
తిరువనంతపురం: తాను కుమారిని కాదని, శ్రీమతిని అని తనను ఇక నుంచి అలాగే పిలవాలని కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా మంత్రి విజ్ఞప్తి చేస్తున్నారు. కేరళ మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రి పీకే జయలక్ష్మి. ఆమెకు ఇటీవలె చిన్ననాటి స్నేహితుడు అనిల్ కుమార్తో పెళ్లి జరిగింది.
పెళ్లికి ముందు ఆమెను కుమారి అని సంబోధించేవారు. పెళ్లయ్యాక కూడా కుమారి అని అంటున్నారు. దీంతో ఆమె.. ఇప్పుడు తాను కుమారిని కాదని, శ్రీమతిని అని చెబుతున్నారు. తనను శ్రీమతి అని సంబోధించాలని కోరుతున్నారు.
ఇందుకోసం ఆమె ఓ సర్క్యులర్ జారీ చేస్తున్నారు. చిన్ననాటి మిత్రుడు అనిల్ కుమార్ను ఆమె మే 10వ తేదీన వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లికి ముఖ్యమంత్రి సహా ఎందరో హాజరయ్యారు. అయినప్పటికీ చాలామంది కుమారి జయలక్ష్మి అంటూ లేఖలలో సంబోధిస్తున్నారు.
దీనిత అసంతృప్తికి లోనైన మంత్రి పికె జయలక్ష్మి ఓ సర్క్యులర్ జారీ చేస్తున్నారు. తనను కుమారి అని పిలవద్దని, శ్రీమతి జయలక్ష్మి అని సంబోధించాలని కోరారు. తన కార్యాలయ అధికారులకు కూడా ఆమె ఆదేశాలు జారీ చేశారు.