హోటల్లో స్మృతిఇరానీ టేబుల్ క్లీనింగ్: కామత్కి నోటీసు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ పైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గురుదాస్ కామత్కు జాతీయ మహిళా సంఘం (ఎస్సీడబ్ల్యూ) శనివారం షోకాజు నోటీసు ఇచ్చింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
మూడు రోజుల క్రితం రాజస్థాన్లో గురుదాస్ కామత్ స్మృతి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవహారాల బాధ్యతలు నిర్వహించడానికి స్మృతికి ఉన్న అర్హతలేమిటని ప్రశ్నించారు. స్మృతి ఇరానీని శుభ్రం చేసే మహిళగా పేర్కొన్నారు.
శుభ్రం చేసే మహిళగా పేర్కొనడంపై ఆయన పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాను ముంబైకి చెందిన వాడిననీ, ఆమె ఒక హోటల్లో శుభ్రం చేస్తుండగా తాను చూశాననీ కామత్ చెప్పారు. వెర్సోవాలోని ఒక హోటల్లో ఆమె టేబుళ్లను తుడిచే వారని చెప్పారు.
కేవలం పదవ తరగతి ఉత్తీర్ణురాలై ఉండటంతో అక్కడ పని చేశారని విమర్శించారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమేనని వ్యాఖ్యానించారు. పెద్దగా చదువుసంధ్యలు లేని ఆమెను విద్యామంత్రి పదవిలో కూచోబెట్టడంపై చర్చ జరుగుతోందన్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ఎన్సీడబ్ల్యూ చీఫ్ తెలిపారు.