డివిల్లీయర్స్కి జై: భారత్లో ఉన్నామా? ఫ్యామిలీ ఆశ్చర్యం
బెంగళూరు: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిల్లీయర్స్కు భారత్లో ఉన్న ఆదరణ చూసి, ఆయన కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. శనివారం నాడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. డివిల్లీయర్స్ బ్యాటింగ్కు వచ్చిన సమయంలో బెంగళూరు అభిమానులు అతని పట్ల అభిమానం చూపించారు.
ఆయన క్రీజులోకి వచ్చినప్పుడు 'ఏబీ.. ఏబీ.. ఏబీ' అంటూ నినాదాలు చేశారు. దీంతో మ్యాచ్ చూసేందుకు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన డివిల్లీయర్స్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.
ముంబైలో జరిగిన తొలి టెస్టులో డివిల్లీయర్స్ భారత బౌలింగ్ను ఊచకోత కోశాడు. ఆ తర్వాత శనివారం రెండో టెస్టులోని మిగతా బ్యాట్సుమెన్ అవుటవుతుంటే అతను మాత్రం నిలకడగా ఆడాడు. తొలుత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా 214 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.
అందులో డివిల్లీయర్స్ చేసిన పరుగులే 85. దీంతో, భారత్ పైన సౌతాఫ్రికా తరఫున ఆడుతున్న డివిల్లీయర్స్ పైన మన అభిమానులకు కోపం రావాలి. లేదా అతడు ఆడుతుంటే కంగారు పడాలి. ఎప్పుడు అవుటవుతాడా అని ఎదురు చూడాలి.
కానీ భారత్ అభిమానులు... డివిల్లీయర్స్ పట్ల ప్రేమాభిమానాలు చూపించారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్కు ఆడుతూ అలరిస్తున్న అతనిని బెంగళూరు అభిమానులు తమ సొంతవాడిలానే చూశారు. డివిల్లీయర్స్కు ఇది వందో టెస్టు. దీంతో, అభిమానులు అతనికి బ్రహ్మరథమే పట్టారు.
అతను మైదానంలోకి వస్తుంటే 'ఏబీ.. ఏబీ.. ఏబీ' అని నినాదాలతో మైదానం హోరెత్తిపోయింది. ఏబీ వందో టెస్టు మ్యాచ్ను చూడ్డానికి భారత్కు విచ్చేసిన అతడి తల్లిదండ్రులు, భార్య అతడిపై ఇక్కడి అభిమానులు చూపిస్తున్న ఆదరణ చూసి ఆశ్చర్యపోయారు. తాము ఉన్నది భారత్లోనా, దక్షిణాఫ్రికాలోనా అని ఆశ్చర్యం కలుగుతోందని డివిలియర్స్ తండ్రి చెప్పారు.