బాబుపై మాజీ సపోర్టర్ ఫైర్: ల్యాండ్ పూలింగ్పై ఫైట్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మాజీ తెలుగుదేశం పార్టీ మద్దతుదారు అయిన మహిళ ద్వారా చిక్కులు వచ్చి పడుతున్నాయి. బోయపాటి సుధారాణి చౌదరి అనే మహిళ రాజధానికి సారవంతమైన భూములను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం ప్రారంభించారు. ఆమెకు మద్దతుగా వుయ్ సపోర్ట్ సుధారాణి చౌదరి అనే శీర్షికతో ఫేస్బుక్కులో, వాట్సప్లో పేజీలు హల్చల్ చేస్తున్నాయి.
ఆమెకు మద్దతుగా వాట్సప్, ఫేస్ బుక్కుల్లో పేజీలు క్రియేట్ చేశారు. గుంటూరు కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన సుధారాణి చౌదరి తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుదారు. అయితే, సారవంతమైన భూములను రాజధాని నిర్మాణం కోసం తేసుకుంటుండడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీపై పోరు ప్రారంభించారు. భూసేకరణపై నిప్పులు కక్కిన ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్నాయి. వీడియోపై విచారణ జరపడానికి పోలీసులు ఆమె ఇంటికి వచ్చారు.

పోలీసులు తమ ఇంటికి రావడంపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వ హయాంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి కూడా స్వేచ్ఛ లేదని ఆమె మండిపడ్డారు. భూసేకరణ జరపడానికి ముందు సిఆర్డిఎ నియమనిబంధనలను తెలుగులో పంపిణీ చేయాలని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయంపైనే తమ కుటుంబం ఆధారపడి ఉందని, తమ భూములను తీసుకుంటే తాము జీవనోపాధి కోల్పోతామని ఆమె అంటున్నారు. తాను పొలానికి వెళ్లిన సమయంలో పోలీసులు వచ్చి తమ కుటుంబం గురించి ఆరా తీశారని ఆమె చెబుతున్నారు. తమది రైతు అనుకూల ప్రభుత్వమని చంద్రబాబు చెప్పడంలో ఏ విధమైన నిజం లేదని, సారవంతమైన భూములను లాక్కోవడానికి సిఆర్డిఎను తెచ్చారని ఆమె విమర్సిస్తున్నారు.
తమ కూతురు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు తయారవుతోందని, కుమారుడు పదో తరగతి చదువుతున్నాడని, ప్రభుత్వం ఇవ్వజూపుతున్న రూ. 30 వేలు తమకు ఏ మాత్రం సరిపోవని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం లేకుండా తాము ఎలా జీవిస్తామని ఆమె అడుగుతున్నారు.












Click it and Unblock the Notifications