కల్వకుంట్ల కవిత స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమె రక్తనమూనాలను సేకరించి ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసులు విరివిగా నమోదవుతున్న నేపథ్యంలో ఆమెకు ఆ వ్యాధే సోకిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కవితకు జలుబు, దగ్గు, జ్వరం ఒకేసారి రావడం, అదీ ఆస్పత్రిలో చేరి వైద్యం చేయాల్సిన పరిస్థితి రావడంతో ఆమె ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆమె నుంచి రక్తం నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.
కవితను పరామర్శించేందుకు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున వస్తుండటంతో ఆసుపత్రి వద్ద సందడి నెలకొంది. అయితే ముఖ్యులను తప్ప లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ ఎంపీ బి.వినోద్ కుమార్ తదితరులు ఆమెను పరామర్శించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమెకు వైద్యసేవలందిస్తున్న డాక్టర్ ఎం.వి.రావు తెలిపారు.
తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, అధికారులు మాత్రం అదేం లేదని కొట్టిపారేస్తున్నారు. ఈ స్థితిలో కవిత స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారనే ప్రచారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది.