బాబును రావొద్దన్నారు! 'నాగార్జున'తో పదవీ గండం?
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఇండియన్ యూత్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు రావొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పలువురు కోరినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగార్జున వర్సిటీలో అడుగు పెట్టిన రాజకీయ నాయకులు పదవులు కోల్పోతారనే ఓ అభిప్రాయంతోనే చంద్రబాబును రావొద్దని కోరినట్లుగా తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి గత సెంటిమెంట్లను పలువురు గుర్తుకు చేసుకుంటున్నారు. సోమవారం నాడు చంద్రబాబు వివిధ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. మిగతా కార్యక్రమాలకు హాజరు కావొచ్చు కానీ, నాగార్జున విశ్వవిద్యాలయంలోని యూత్ కాంగ్రెస్ సమావేశాలకు మాత్రం వద్దని అభిమానులు పట్టుబట్టారని అంటున్నారు. అందుకు బలమైన కారణాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
వర్సిటీలో అడుగు పెట్టిన ఏ రాజకీయ నాయకుడు కూడా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేదని గుర్తుకు చేసుకుంటున్నారు. గతంలో ఉప రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ప్రారంభఇంచారు. అనంతరం కొద్ది రోజులకు ఆయన మృతి చెందారు.
అనంతరం మంత్రి హోదాలో దూళిపాళ్ల వీరయ్య చౌదరి ఓ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆయన కొద్ది రోజులకే పదవి కోల్పోయారు. దాదాపు ఐదేళ్ల క్రితం అప్పటి ఏపీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఓ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆయన పదవి కోల్పోయారు.
ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం రాజధాని ప్రాంతంగా తొలుత నాగార్జున విశ్వవిద్యాలయం పేరు ప్రచారంలోకి వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయం ఇక్కడ ప్రారంభించాలని భావించారు. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు నాగార్జున వర్సిటీలో జరుపుతామని చెప్పారు. ఇవన్నీ కూడా జరగలేదు.
కాగా, గుంటూరులో అఖిల భారత యువజన సైన్స్ కాంగ్రెస్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస రావు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు హాజరయ్యారు.