ఇక్కడి ఎమ్మెల్యేనే..: వంశీకి చేదు అనుభవం
విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడ విమానాశ్రయంలో స్థానిక తెలుగుదేశం శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ విమానాశ్రయానికి వస్తున్నారన్న సమాచారంతో ఆయన్ను కలిసేందుకు వంశీ వెళ్లారు.
ఈ సమయంలో వంశీని విమానాశ్రయం లోపలికి వెళ్లేందుకు ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు.
దీంతో దాదాపు గంటపాటు ఇక్కడే వేచివున్న ఆయన.. చివరకు సిఎం చంద్రబాబును కలకుండానే వెనుదిరిగి వెళ్లారు. కాగా, అంతకుముందు సిబ్బంది వ్యవహారశైలిపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రితో బాబు భేటీ
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం కేజీ బేసిన్లో పర్యటిస్తారు.
ఆ తర్వాత ఏపి సిఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఏపిలోని పరిశ్రమలకు గ్యాస్ సరఫరా గురించి కేంద్రమంత్రితో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. పుష్కరాల పనులను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే రాజమండ్రికి బయల్దేరారు.