రోజా చెప్పింది నిజం!: మున్సిపల్ కమిషనర్ సస్పెండ్
చిత్తూరు: పురపాలక సంఘ నిధుల దుర్వినియోగంపై ఆరోపణల పైన నగరి కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు పురపాలక పరిపాలన శాఖ సంచాలకులు కన్నబాబు మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చారు. 10 నెలల క్రితం నగరి కమిషనర్గా బాలాజీ నియమితులయ్యారు.
ఆది నుంచి ఆయన శైలి వివాదాస్పదమే. నిధుల దుర్వినియోగం, పింఛన్ల పంపిణీలో అవకతవకలకు పాల్పడ్డ కారణంగా ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. నగరి ఎమ్మెల్యేగా రోజా ఉన్నారు.
మునిసిపల్ కమిషనర్గా బాలాజీనాథ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎమ్మెల్యే రోజా, మునిసిపల్ చైర్ పర్సన్, వైసీపీ నేత కేజే శాంతిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషనర్ వ్యవహరిస్తున్నారని వారు పలుమార్లు ఆందోళనలకు దిగారు.
ఒకానొక సందర్భంగా కేజే శాంతి కుమారుడు కమిషనర్ పైన దాడి చేశారని వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కేజే శాంతి కుమారుడితో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా నగరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కమిషనర్ అవినీతి వ్యవహారం, ఇష్టారాజ్య పాలనపై రోజా మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు రోజా ఆరోపణల్లో నిజముందని తేల్చారని తెలుస్తోంది.

తనపై విచారణ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న బాలాజీనాథ్ వారం రోజులుగా కనిపించడం లేదని సమాచారం. కనీసం సెలవు పెట్టకుండా, తన బాధ్యతలు ఇంకొకరికి అప్పగించకుండా, తన గదికి తాళం వేసుకుని మరీ ఆయన వెళ్లిపోయారు.
దీనిపై కేజే శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, నిన్న రాత్రి ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. నగరి మునిసిపాలిటీ బాధ్యతలను పుత్తూరు కమిషనర్ శ్రీహరిబాబుకు అదనంగా అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కడప జిల్లా నుంచి బదలీపై వచ్చిన కమిషనర్ బాలాజీ ఆదినుంచి వివాదాస్పదంగానే వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలోనే నిత్య వివాదాస్పదుడిగా పేరొందారు.
ఏ స్థాయిలోని సిబ్బంది, అధికారితో పొసగిన దాఖలాలు లేవని తెలుస్తోంది. తాను చెప్పిందే వినాలన్నరీతిలో వ్యవహరించే వారంటున్నారు. ఏ సమస్య పైన పరిష్కారం కోసం ఆసక్తి చూపక పోవడం, చివరకు ఆయనపై ప్రత్యర్థులు దాడులకు పాల్పడేదాకా తెచ్చుకోవడం, ఇలా అన్నీ వివాదాలే అంటున్నారు.












Click it and Unblock the Notifications