లోకేష్, బ్రాహ్మణీల సంభాషణలూ ట్యాప్ చేశారు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల ఫోన్లను తెలంగాణ నిఘా వర్గాలు ట్యాప్ చేశాయని ఏపీ పోలీసులు అనుమానిస్తున్నారు. తమ దర్యాప్తులో అనేక ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న సింగపూర్, జపాన్ ప్రతినిధుల మాటలను, ఏపీ ప్రభుత్వ ముఖ్యుల కుటుంబసభ్యుల మధ్య జరిగిన సంభాషణలనూ తెలంగాణ నిఘా వర్గాలు ట్యాపింగ్ ద్వారా విన్నట్లు ఏపీ పోలీసులు పేర్కొంటున్నారు.
తెలుగుదేశం యువనేత తన జీవిత భాగస్వామితో ఫోన్ సంబాషణలను సైతం ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారని అనుమానిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల వ్యాపార, వ్యక్తిగత విషయాలనూ తెలంగాణ పోలీసులు ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నట్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేయనున్న కౌంటర్ పిటిషన్లో ఈ అంశాలన్నీ పొందుపరచనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఓటుకు నోటు కేసు నేపథ్యంలో... ఏపీ ముఖ్యుల ఫోన్లను ట్యాప్ చేసి ఉండొచ్చని తొలుత భావించారు. 25 నెంబర్లకు సంబంధించి బలమైన అనుమానాలు ఉండటంతో కొన్ని ఆధారాలు సేకరించి, వాటి వివరాలను సర్వీస్ ప్రొవైడర్లను అడిగారు. తాజాగా మరో 29 నెంబర్ల జాబితాను పరిశీలించడంతో... ట్యాపింగ్ వివాదంలో మరిన్ని కోణాలు బయటపడ్డాట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి సింగపూర్, జపాన్ తదితర దేశాల్లోని పారిశ్రామికవేత్తలకు వెళ్లిన ఫోన్లను సైతం తెలంగాణ నిఘా వర్గాలు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. రెండో జాబితాలో చంద్రబాబు కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు సైతం ఉన్నట్లు సమాచారం. ఆయన కుమారుడు, కోడలు ఫోన్లను సైతం హైదరాబాద్లో ట్యాప్ చేసినట్లు ఏపీ పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది.