రేవంత్ రెడ్డికి లాగేనని పీతల సుజాత: ఎవరా మహిళ?
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత నివాసంలో పట్టుబడిన పది లక్షల రూపాయల నోట్ల కట్టల సంచీ పట్టుబడిన కేసు కొత్త మలుపు తీసుకుంటోంది. మంత్రి ఆచితూచి సమాధానం ఇచ్చినా నీలినీడలు మాత్రం అలుముకుంటున్నాయి. తెలంగాణ టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై కుట్ర జరిగినట్లుగానే తనపై కూడా కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోందని సుజాత అన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీని కోరినట్లు తెలిపారు. బ్యాగులో డబ్బు కాకుండా బాంబు పెట్టి ఉంటే తన పరిస్థితి ఏమిటని ఆమె అడిగారు.
తన ఇంటి ఆవరణలో డబ్బు వదిలిన మహిళ ఎవరో తనకు తెలియదని, ఆ సమయంలో తాను ఇంట్లో లేనని చెప్పారు. మంత్రి ఇంటి ఆవరణలో డబ్బుల సంచీని వదిలి పెట్టిన మహిళను పాలకొల్లు మండలం జున్నూరుకు చెందిన రిటైర్డ్ టీచర్ అద్దాల విష్ణువతిగా గుర్తించారు. కాగా, అద్దాల విష్ణువతి బుధవారం ఉదయం మంత్రి నివాసంలో ప్రత్యక్ష్యమైంది.
ఆమెను వీడియో తీసేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిఎస్సీ ఫలితాలు వెలువడిన రోజునే ఈ సంఘటన జరగడం కూడా అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. మంత్రి ఆవరణలో వదిలి వెళ్లిన నోట్ల కట్టల సంచీలో కార్ని శ్రీలక్ష్మి అనే యువతికి చెందిన డిఎస్సీ హాల్ టికెట్, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి.
దాంతో టీచర్ పోస్టుల కోసం జరిగిన పైరవీల్లో భాగంగానే ఈ సంఘటన చోటు చేసుకందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా, పీతల సుజాత మాత్రం చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. మంత్రి కూడా తొలుత సంఘటనకు సంబంధించి పొంతనలేని జవాబులు ఇచ్చినట్లు చెబుతున్నారు.