హీరోతో ఫోటో: వివాదంలో ఐపీఎస్ మహిళా అధికారి
తిరువనంతపురం: ప్రసిద్ధి చెందిన మళయాల నటుడితో ఒక మహిళా పోలీసు అధికారిని యూనీఫాంలో ఫోటో తీసుకుందని పెద్ద వివాదం చెలరేగింది. మీడియా లేనిపోని రాద్దాంతం చేస్తున్నదని, తను ఏ తప్పు చెయ్యలేదని ఆమె అంటున్నారు.
ఎర్నాకుళంలోని ఒక కాలేజ్ లో ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేరళ హోం శాఖ మంత్రి, ప్రముఖ హీరో నివిన్ పాలీతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరైనారు. అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తున్న మెరిన్ జోసెఫ్ ఆ కార్యక్రమానికి వెళ్లారు.
తరువాత నటుడు నివిన్ తో ఆమె ఫోటో తీసుకున్నారు. ఫోటోను మెరిన్ తన ఫేస్ బుక్ లో ఫోస్ట్ చేశారు. తరువాత అనేక లైక్ లు, కామెంట్లు వచ్చాయి. ఆ సంతోషం ఆమెకు ఎక్కువ సేపు నిలువలేదు. కేరళలోని పలు టీవీ చానెల్స్ లో వరుస కథనాలు వచ్చాయి.
యూనీఫాంలో ఒక పోలీసు అధికారి ఈ విధంగా ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తూ వార్తాకథనాలు ప్రసారమయ్యాయి. విషయం తెలుసుకున్నమెరిన్ జోసెఫ్ మీడియాపై మండిపడ్డారు. వారికి టీఆర్ పీ రేటింగ్ వస్తే చాలని ఇంక వేరే విషయాలు పట్టించుకోరని విరుచుకుపడ్డారు.
నటుడు నివిన్ తో తాను ఫోటో తీసుకోవాలని చెప్పడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ శాసన సభ్యుడు ఫోటో తీశారని, అప్పటికి కార్యక్రమం పూర్తి అయ్యింది, హోం మినిస్టర్ వెళ్లి పోయిన తరువాతే తాను నటుడు నివిన్ ను కలిశానని ఐపీఎస్ అధికారిని మెరిన్ వివరణ ఇచ్చారు.