రాజయ్య ప్రెస్ మీట్ రద్దు: కెసిఆర్ మందలింపే?
హైదరాబాద్: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య తన మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఆయన దాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకోవడానికి గల కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. మీడియా సమావేశంలో ఆయన కీలకమైన నిర్ణయం ప్రకటిస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు.
మీడియా సమావేశం రద్దయినట్లు రాజయ్య సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో రాజయ్య సోమవారంనాడు సమావేశమయ్యారు. పదవి నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత రాజయ్య కెసిఆర్ను కలవడం ఇదే మొదటిసారి. దాదాపు ఇరవై నిమిషాల పాటు రాజయ్యతో కెసిఆర్ మాట్లాడారు.

తొందరపడవద్దని, మంచి రోజులు ఉన్నాయని, కొంత ప్రవర్తన మార్చుకోవాలని కెసిఆర్ రాజయ్యకు సూచించినట్లు సమాచారం. సుతిమెత్తగా కెసిఆర్ ఆయనను మందలించారని కూడా అంటున్నారు. తనకు తెలిసి తాను ఏ విధమైన తప్పూ చేయలేదని, కొందరు అధికారులు తనను మభ్యపెట్టారని రాజయ్య కెసిఆర్కు చెప్పుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయిదారు నెలల పాటు సహనం వహిస్తే మరో పదవి ఇస్తానని కెసిఆర్ రాజయ్యుకు చెప్పినట్లు సమాచారం.
తాను కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని భేటీ అనంతరం రాజయ్య చెప్పారు. మంగళవారం జరిగే పార్టీ సమావేశానికి కూడా ఆహ్వానించారని చెప్పారు. అయితే, తన వాదనను కెసిఆర్ వినిపించుకోకపోవడంపై రాజయ్య మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. దాంతోనే ఆయన అన్ని విషయాల గురించి మాట్లాడడానికి మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ మీడియా సమావేశం రద్దు వెనక ఎవరున్నారనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications