రోహిత్ శర్మతో రీతికను కలిపిందెవరు?
ముంబై: రీతిక సజదేహ్తో క్రికెటర్ రోహిత్ శర్మ నిశ్చితార్థం జరిగిపోయింది. అయితే, వీళ్లిద్దరూ ఎలా కలిశారనేది ఆసక్తికరమైన విషయమే. కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ యజమాని బంటీ సచదేవ ప్రముఖ సెలిబ్రిటీల ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్ చూస్తుంటారు. రోహిత్ శర్మ ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్స్ కూడా ఆయనే చూస్తారు.
బంటియే రోహిత్ శర్మ, రీతికలను కలిపాడట. పదేళ్లుగా తనకు రోహిత్ తెలుసునని, భారత జట్టుకు ఎంపిక కాక ముందే రోహిత్తో పరిచయం ఉందని, వారిద్దరు తన ద్వారా కలిశారని, వారే ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారని బంటీ అంటున్నారు.
రోహిత్, రీతికల మధ్య పరిచయానికి ఆరేళ్ల వయసు ఉందట. కార్నర్ స్టోన్ కోసం రీతిక రోహిత్ శర్మ స్పోర్టింగ్ ఎంగేజ్మెంట్స్ చూస్తూ ఉండేదట. వ్యక్తిగా రోహిత్ అంటే తనకు చాలా ఇష్టమని బంటీ అంటున్నారు. రోహిత్ తమ కుటుంబంలో ఒక్కడు కావడం ఎంతో సంతోషంగా ఉందని బంటీ అన్నారు.
బంటీ రీతికకు కజిన్ మాత్రమే. కానీ బంటీ రీతికను సొంత సోదరి మాదిరిగా చూసుకుంటారు. బంటీ కంపెనీలో మొట్ట మొదట చేరింది రీతికనే. అప్పటి నుంచి ఆమె ఆ కంపెనీని అంటి పెట్టుకుని ఉంది. పెళ్లి తర్వాత కంపెనీలో పని చేయాలా, వద్దా అనేది, చేస్తే ఏ విధమైన పనిచేయాలి అనేది రీతిక ఇష్టమని బంటీ అంటున్నారు. ఇది ఆమె కార్యాలయమని, ఎలాగైనా ఉండవచ్చునని, బ్రేక్ తీసుకున్నా ఆమె ఇష్టమని బంటీ అన్నారు.
నిశ్చితార్థం జరిగినప్పటికీ రోహిత్, రీతికల వివాహం తేదీ నిర్ణయం కాలేదు. క్రికెట్ సీజన్ ప్రారంభం అవుతుండడంతో రోహిత్ ఆటపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని బంటీ అంటున్నారు.