రోజా తిట్ల ఎఫెక్ట్, ఎమ్మెల్యేలకు శిక్షణ! కోడెల క్షమాపణ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. దీనిపై సభాపతి కోడెల శివప్రసాద రావు ఆదివారం గుంటూరు జిల్లాలో స్పందించారు. రోజా అనుచిత భాష సస్పెన్షన్కు కారణమైందని చెప్పారు.
రోజా కాల్ మనీ బాబు, సెక్స్ రాకెట్ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. ఓ ముఖ్యమంత్రిని అలా వ్యాఖ్యానించడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కోడెల ఆదివారం గుంటూరు జిల్లాలో రోజా సస్పెన్షన్, అసెంబ్లీ సమావేశాల పైన స్పందించారు.
సభలో అన్ పార్లమెంటరీ పదాలు, బూతులు రావడం చాలా బాధాకరమని రోజాను ఉద్దేశించి కోడెల అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తాను గతంలో ఎప్పుడూ వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలన్నారు.
సభలో ప్రజా సమస్యల పైన చర్చ అవసరమన్నారు. కానీ ప్రతిపక్షం వల్ల మూడు రోజుల పాటు సభా సమయం వృథా అయిందన్నారు. సభలో సభ్యులకు నిరసన తెలిపే హక్కు ఉందని, దానిని ఎవరూ కాదనలేరని, కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి లేదన్నారు.
అసెంబ్లీ సరిగా నడవటం లేదని, అందుకు తాను ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని కోడెల అన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు మంచిగా జరగాలంటే ఎమ్మెల్యేలకు శిక్షణ అవసరమన్నారు.