500ఏళ్ల కట్టుబాటు: గుళ్లోకి ప్రవేశించిన మహిళ, రగడ
ముంబై: అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ శని దేవాలయంలోకి గుర్తు తెలియని మహిళ ప్రవేశించింది. దీనిని నిరసిస్తూ శని శింగాపురం గ్రామస్థులు ఆదివారం నాడు కొద్ది గంటల పాటు బంద్ నిర్వహించారు. గుర్తు తెలియని మహిళ ఆలయంలోకి వచ్చినందున పాలాభిషేకం చేశారు.
మహారాష్ట్రలోని ఈ దేవాలయంలో చాలాకాలం నుంచి ఈ సంప్రదాయం ఉంది. అందుకు విరుద్ధంగా మహిళ ఈ ప్రముఖ దేవాలయంలో ప్రవేశించి పూజలు నిర్వహించింది. దేవాలయంలో మహిళల ప్రవేశంపై దాదాపు 500 వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న నిషేధాన్ని ఉల్లంఘించింది.
శనివారం బ్యారికేడ్ను దూకి ఆలయంలో ప్రవేశించిన ఆమె మూలవిరాట్టుకు పూజలు నిర్వహించింది. ఆ తర్వాత జనంలో కలసి అక్కడినుంచి అదృశ్యమైంది. దీనిపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆదివారం ఉదయం అక్కడ బంద్ పాటించారు.
దీంతో ఆలయ కమిటీ రంగంలోకి దిగి ఏడుగురు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది. గ్రామస్థులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి ఆలయాన్ని శుద్ధి చేశారు. మరోవైపు, కొన్ని సామాజిక సంస్థలతోపాటు వివిధ వర్గాలు ఆ మహిళ చర్యను సమర్థిస్తున్నాయి.
మహిళల ఆలయ ప్రవేశంపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎంతో ధైర్యంగా ఉల్లంఘించిన ఆమె అభినందనీయురాలని కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె, షోలాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణతి షిండే అన్నారు.వచ్చే నెల నాగ్పూర్లో ప్రారంభమయ్యే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామన్నారు.