ఫోటోలు: వారిద్దరు ఎదురు పడ్డారు ఇలా..
హైదరాబాద్: రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి ఎదురు పడ్డారు. శాసనసభ ఆవరణలో వారిద్దరు ఎదురుపడి పరస్పరం పలకరించుకున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శానససభా సమావేశాలు ఒకేసారి జరుగుతుండడంతో వారిద్దరు ఇలా కలుసుకునే సందర్భం ఏర్పడింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శానససభలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను ప్రతిపాదించడానికి ముందు మంత్రి వర్గ సమావేశానికి చంద్రబాబు వెళ్తుండగా జానా ఎదురయ్యారు.
తనకు ఎదురుగా వచ్చిన చంద్రబాబుకు జానా రెడ్డి నమస్కారం చేసి కుశలప్రశ్నలు వేశారు. ఇరువురు యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సంఘటన గురువారంనాడు చోటు చేసుకుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గురువారంనాడు ప్రారంభం కాగా, ఎపి శాసనసభా సమావేశాలు గత శనివారంనాడు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ సమావేశాల ప్రారంభం రోజు పలు ఆసక్తికరమైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. టిడిపి సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పచ్చకండువాలు వేసుకుని రాగా, ఆర్ కృష్ణయ్య మాత్రం మామూలుగానే వచ్చారు. ఇటీవలే తెరాసలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువా వేసుకుని సమావేశాలకు వచ్చారు.