‘తాళికట్టే తేదీకి అందరికీ శుభలేఖలు’: కిరణ్కుమార్ రెడ్డిపై కోడిగుడ్ల దాడి
చిత్తూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి వెలుగులోకి వచ్చారు. తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఎన్నికల్లో కొత్త పార్టీతో రంగ ప్రవేశం చేసి ఘోర పరాజయం పాలైన నాటి నుంచి ఆయన ఏ కార్యక్రమంలోనూ ఎక్కువగా పాల్గొనడం లేదు. చాలా కాలం తర్వాత ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బుధవారం చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సందడి చేశారు. అభిమానులు, కార్యకర్తలను ఆత్మీయంగా పలుకరించారు. 'ఏమన్నా అందరూ బాగున్నారా.. ఏం చేస్తున్నారు. మీ అందరికీ చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్తాను.. అంటూ కిరణ్కుమార్రెడ్డి గ్రామస్థులను పేరుపేరునా పలకరించారు. అందరి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఈ సందర్భంగా 'తమను ఏదో ఓక పార్టీలోకి తోయండి, ఆపార్టీని పట్టుకుని వేలాడుతుంటాము, ఏమీ చెప్పకపోతే ఏలా?' అని తరిగొండలో ఓ కార్యకర్త మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి స్పందిస్తూ.. 'పెళ్లి గురించి మాట్లాడాము, పెళ్లికూతురు పేరు గోప్యం. తాళిబొట్టు కట్టే తేది ఖారారైతే మీకందరికి శుభలేఖలు వస్తాయి కదా తొందరెందుకు?' అని సమాధానం చెప్పారు. దీంతో కార్యకర్తలు భవిష్యత్పై ఊహించుకోవడం మొదలుపెట్టారు.
కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, మరికొందరు, టిడిపి అని, ఇంకొందరు బిజెపి అని, ఏదో ఎందుకు? పాతగూడే బెటర్ అని మరికొందరు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకున్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి మనసులో ఏముందో ఆయన ప్రకటించే వరకు తెలిసే అవకాశమైతే లేదు. అందుకే అంతవరకు వేచి చూడకతప్పదు.
కోడి గుడ్ల దాడి
ఇది ఇలా ఉండగా, మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిపై బస్సులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరారు. బుధవారం గుర్రంకొండ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుంటుండగా ఆయనపై దుండగులు ఆర్టీసీ బస్సులో నుంచి కోడిగుడ్లు విసిరారు. కాగా, అవి పోలీసులపై పడ్డాయి. ఆ దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.