‘108’లో ప్రియుడితో తాళి కట్టించికున్న యువతి!
బెంగళూరు: ఓ యువతి తాను ప్రేమించిన యువకుడిని ఆంబులెన్స్(108)లో వివాహం చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని దేవనగిరి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే.. బెంగళూరుకి 200 కి.మీలుదూరంలో ఉన్న చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన నేత్రవతి అదే ప్రాంతానికి చెందిన గురుస్వామి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
కాగా, మే23న ఈ ప్రేమ జంట చిత్రదుర్గ కోటకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ నేత్రావతి కోటపై నుంచి కాలు జారి పడిపోయింది. గురుస్వామి వెంటనే నేత్రావతిని స్థానిక ఆస్పత్రికి తరలించగా వెన్నుముక విరిగిందని, మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించాలని సూచించారు.
బెంగళూరులో వారం పాటు చికిత్స పొందినా.. నేత్రావతి కాలు కింద పెట్టలేని పరిస్థితి. కాగా, అంతకుముందు నేత్రావతి, గురుస్వామి అమావాస్య రోజున చిత్రదుర్గలో జరిగే సామూహిక వివాహాల్లోనే తామూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
కానీ, నేత్రావతి కదల్లేని పరిస్థితిలో ఉండడంతో ఆంబులెన్స్నే వారు కళ్యాణమండపంగా భావించారు. దీంతో అక్కడికే వచ్చిన ఓ పూజారి వారి వివాహం జరిపించారు. సన్నిహితుల సమక్షంలో గురుస్వామి తన ప్రియురాలు నేత్రావతి మేడలో తాళికట్టి తనదాన్ని చేసుకున్నాడు. దీంతో అక్కడ ఆనందం వెల్లివిరిసింది. కోరుకున్న వ్యక్తితో వివాహం జరగడంతో నేత్రావతి కూడా ఆనందం వ్యక్తం చేసింది.