అయ్యో! విజయసాయీ!!: ఏమి కష్టమొచ్చె..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుంగు అనుచరుడు, నమ్మిన బంటు విజయసాయి రెడ్డికి ఎక్కడలేని కష్టాలొచ్చి పడ్డాయి. సునాయసంగా రాజ్యసభలో కాలు పెడుతానని ఉన్న ఆయన ధీమా మెల్లమెల్లగా నీరు గారిపోతోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఒక్కరొక్కరే టిడిపిలో చేరుతుండడంతో ఆయనకు రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అవసరమైనంత మంది శాసనసభ్యులుంటారా అనేది కూడా అనుమానంగానే మారింది. భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, జ్యోతుల నెహ్రూ ఇలా వరుసగా టిడిపిలో చేరిపోయారు. ఇప్పుడు సుజయకృష్ణ రంగారావుతో పాటు మరో ఇద్దరు విజయనగరం శాసనసభ్యులు టిడిపిలో చేరేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.
విజయసాయి రెడ్డిని రాజ్యసభకు పంపిస్తామని ఏడాది కిందటే జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో సీనియర్ నేత ఎంవి మైసూరా రెడ్డి పార్టీకి దూరంగా జరిగారు. విజయ సాయి రెడ్డికి ఇటీవలి దాకా పరిస్థితులు సానుకూలంగానే కనిపించాయి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి శాసనసభ్యుల వలసలు ఊపందుకున్నాయి. దీంతో విజయసాయి రెడ్డి ఆశ అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది.. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నలుగురు ఎన్నిక కావాల్సి ఉంది. ఒక్కో అభ్యర్థికి 44 ఓట్లు రావాలి.
శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 67 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో 11 మంది శాసనసభ్యులు సైకిలెక్కేశారు. దాంతో 56 మంది శానససభ్యులు మాత్రమే మిగిలారు. సాయిరెడ్డి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు కావాల్సిన వారికంటే 12 మంది ఎక్కువే ఉన్నారు. కానీ, వారైనా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు.
సుజయకృష్ణ రంగారావుతో పాటు రాజన్నదొర, పుష్పశ్రీవాణి కూడా సైకెలెక్కేస్తే వైసిపి బలం మరింత తగ్గిపోతుంది. వీరితోనైనా వలసలు ఆగిపోతాయా అంటే అటువంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు శాసనసభ్యులు టిడిపిలో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
పరిస్థితి చూస్తుంటే 25 నుంచి 30 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిలో చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగైతే వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 44కంటే తక్కువకు పడిపోతుంది. దాంతో విజయసాయి రెడ్డి రాజ్యసభకు ఎన్నిక కావడం దుర్లభమే అవుతుంది. అందుకే, ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి విజయసాయి రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అసలే, ఎండా కాలం విజయసాయి గారికి ఏమి కష్టమొచ్చె అని అనుకుంటున్నారంతా...