కాపు: పవన్ కళ్యాణ్ కాపాడేనా, బాబు చక్రం తిప్పేనా?
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో జరగనున్న కాపు గర్జన సభవల్ల అందరికంటే ముందు చిక్కులు తెచ్చేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకేనని బిజెపి నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
కాపు గర్జన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరుగుతోంది. ముద్రగడ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే వాదనలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జగన్ మాట్లాడుతూ... ముద్రగడ వెనుక తాము ఉన్నామని చెప్పారు.
కాపులను బిసిల్లో చేర్చాలనే ప్రధాన డిమాండుతో ఈ కాపు గర్జన జరగనుంది. ఈ నేపథ్యంలో కాపు ఓట్ల కోసం ప్రధాన పార్టీలో పోటీ పడుతున్నాయని చెప్పవచ్చు. ఈ కారణంగానే ముద్రగడ వెనుక తాము ఉన్నట్లు జగన్ చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ముద్రగడ గర్జనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పింది.
బిజెపి నేతలు కూడా వ్యక్తిగతంగా ముద్రగడ కాపు గర్జనకు మద్దతు పలుకుతున్నారు. ఇలా చూస్తే.. కన్నా చెప్పినట్లు చంద్రబాబుకు చిక్కులేననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో తన మద్దతు ద్వారా టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి కారణమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి చంద్రబాబును ఏ మేరకు కాపాడగలుగుతారనే చర్చ కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ప్రచారం వల్లే టిడిపి గెలిచిందని చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు పలుమార్లు చెప్పారు. అందుకే ఆయన్ని దూరం చేసుకోకుండా ఉండేందుకు చంద్రబాబు పలుమార్లు సున్నితంగా వ్యవహరించారు. రాజధాని భూమి తదితర అంశాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు టిడిపి సానుకూలంగా స్పందించింది.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా రాజధాని భూమి తదితర విషయాల్లో తొలుత చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టినప్పటికీ... ఆ తర్వాత వెనక్కి తగ్గడం, చంద్రబాబును మెచ్చుకోవడం కూడా జరిగాయి. తద్వారా పవన్ కళ్యాణ్ తనకు దూరం కాకుండా చంద్రబాబు చక్రం తిప్పారు.
పవన్ కళ్యాణ్ కుల, మత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు రక్షించగలరా అనే చర్చ సాగుతోంది. అయితే కాపు గర్జనకు బిజెపి మద్దతివ్వడం గమనార్హం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పెద్దగా మాట్లాడకపోవచ్చునని, మరీ మాట్లాడవలసి వస్తే... 'ఇచ్చిన హామీలు నెరవేర్చాలని' మాత్రం చెబుతారామే అంటున్నారు.