టార్గెట్ చంద్రబాబు!: అమిత్ షా వ్యాఖ్యల్లో ఆంతర్యం అదేనా?.. పెద్ద దెబ్బే!
విజయవాడ నుంచే బీజేపీ అసలు ప్రస్థానం మొదలవతుందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో ఆ పార్టీ లక్ష్యమేంటో స్పష్టం చేస్తున్నాయి.
అమరావతి: మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల మీద దండయాత్ర చేయాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బలంగా ఫిక్సయిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసి బీజేపీ విస్తరణే ధ్యేయంగా పావులు కదపాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యటన అటు కేసీఆర్ సర్కార్ కు, ఇటు చంద్రబాబు సర్కార్ కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీకి చెప్పుకోదగ్గ సామర్థ్యం లేకపోయినప్పటికీ.. ఇక నుంచి ఆ దిశగా దృష్టి సారించాలని అమిత్ షా తన డైరెక్షన్ మొదలుపెట్టారు. ముఖ్యంగా గురువారం నాడు విజయవాడలో ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు సర్కార్ ను ఒకింత అప్రమత్తతకు గురిచేశాయి.
విజయవాడ నుంచి బీజేపీ ప్రస్థానం:
విజయవాడ నుంచే బీజేపీ అసలు ప్రస్థానం మొదలవతుందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో ఆ పార్టీ లక్ష్యమేంటో స్పష్టం చేస్తున్నాయి. విజయవాడ-అమరావతి-గుంటూరు ప్రాంతాల్లో బీజేపీ పునాదులు పటిష్టపరిచడం ద్వారా టీడీపీని బలహీనం చేయాలనే ఆలోచనలో భాగంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.
బీజేపీలో పెరుగుతున్న అసహనం:
దానికి తోడు అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో.. సభలో కొంతమంది 'లీవ్ టీడీపీ.. సేవ్ బీజేపీ' అన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ లెక్కన టీడీపీతో తెగదెంపుల పర్వానికి బీజేపీని క్షేత్రస్థాయిలో సిద్దం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ప్లకార్డుల ప్రదర్శన జరిగినట్లు భావించాల్సి ఉంటుంది. టీడీపీ వల్ల పార్టీకి కలిగే ప్రతికూలతను తెలియపరచడానికే కమలం కార్యకర్తలు ఏకంగా అమిత్ షా ముందు టీడీపీపై తమ అసహనాన్ని వెళ్లగక్కారు.
పొత్తు అనుమానమే!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే.. తన ప్రసంగంలో టీడీపీతో పొత్తు గురించి అమిత్ షా ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో భవిష్యత్తులో టీడీపీతో పొత్తు కొనసాగించాలనే దానిపై బీజేపీ కచ్చితంగా పునరాలోచనలో ఉన్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతానికి చంద్రబాబు ప్రభుత్వం పట్ల బీజేపీ అధిష్టానం సఖ్యతతోనే మెలుగుతున్నా.. క్షేత్రస్థాయిలో రాష్ట్ర బీజేపీ నుంచి ఒత్తిడి వస్తే మాత్రం ఆ పొత్తుకు భంగం వాటిల్లే అవకాశం లేకపోలేదు.
టార్గెట్ చంద్రబాబు!
టీడీపీతో పొత్తు విషయంలో గనుక విభేదిస్తే.. బీజేపీతో చేతులు కలపడానికి ఎలాగు జగన్ సిద్దంగా ఉన్నారు కాబట్టి, కమలనాథులు వైసీపీకి దగ్గరవుతారా? అన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. చంద్రబాబును బీజేపీ ఏ సమయంలోనైనా టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు.