ఇవాంక కోసం పాత బస్తీ గాజులు: చెమటోడ్చారు
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక కోసం హైదరాబాద్ పాతబస్తీ గాజులు వ్యాపారులు కూడా ఎదురు చూస్తున్నారు. పాతబస్తీ గాజుల తయారీకి ప్రసిద్ధి.
హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక కోసం హైదరాబాద్ పాతబస్తీ గాజులు వ్యాపారులు కూడా ఎదురు చూస్తున్నారు. పాతబస్తీ గాజుల తయారీకి ప్రసిద్ధి. ఇక్కడి గాజుల మీద సరోజనీ నాయుడు కవిత్వం కూడా రాశారు.
ఇప్పటికే ఇవాంకకు సిద్ధిపేట చేనేత కార్మికులు నేసిన గొల్లభామ చీరెలను బహూకరించడానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసింందే. ఆమె పాతబస్తీలో షాపింగ్ చేస్తారనే ప్రచారం జరగడంతో అక్కడి గాజుల వ్యాపారులు అప్రమత్తమై, ఆమెకు బహూకరించడానికి ప్రత్యేకమనే గాజులను రూపొందించారట
ఆ ప్రచారంతో ఇలా...
హైదరాబాదులోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి షాపింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇవాంకా పర్యటనను వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పాతబస్తీ ఏరియాల్లో భారత్, అమెరికా జాతీయ జెండాలను పోలి ఉండేలా గాజులను తయారు చేశారు.
గాజులపై ఇవాంక పేరు..
గాజులపై ఇవాంకా పేరుతోపాటు జీఈఎస్ సదస్సు పేరును కూడా వ్యాపారులు ముద్రించారు. ఈ గాజులను వారు భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలకు గుర్తు రూపకల్పన చేసినట్లు వారు చెబుతున్నారు. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్, హైదరాబాద్కు వస్తోందని తమకు తెలిసిందనీ, అందుకే ఈ విధంగా గాజులను తయారు చేశామని అంటున్నారు.
తయారీకి 45 రోజులు...
అవకాశం వస్తే ఇవాంకాకు ప్రత్యేకంగా రూపొందించిన గాజులను బహుమతిగా ఇస్తామని పాతబస్తీ వ్యాపారులు అంటున్నారు. ఈ గాజులను తయారు చేయడానికి 45 రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు. ఇవాంకకు హైదరాబాద్ పాతబస్తీ గాజుల విశిష్టత తెలిస్తే తప్పకుండా వస్తారేమో.
దోమల బెడద...
ఇవాంక పర్యటనలో భద్రతకు ఏ విధమైన లోపం లేదని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసు అధికారులు చెప్పారు. ఆమెతో పాటు విదేశీ ప్రతినిధులకు ఫలక్నుమా ప్యాలెస్లోనూ గోల్కొండ కోటలోనూ విందు ఏర్పాట్లు చేశారు. అయితే, అక్కడ దోమల బెడద ఎక్కువగా ఉందని అంటున్నారు. దోమల బెడదను అరికట్టడం ఎలా అనే యోచనలో అధికారులు పడినట్లు చెబుతున్నారు.