చైనా ఎందుకు తోక ముడిచింది?: నిజాలివే.. డోక్లాం ప్రతిష్టంభనపై మోడీ అలా చేస్తారనే?
భారత్తో కొర్రీలు చైనా ద్వంద్వ నీతిని బయటపెడుతుండటంతో డోక్లాం నుంచి వెనక్కి తగ్గక తప్పలేదు.
బీజింగ్: నిన్న మొన్నటిదాకా ఓపిక నశించిందంటూ భారత్పై యుద్దం దిశగా వ్యాఖ్యలు చేసిన చైనా.. ఉన్నట్లుండి డోక్లాం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. దాదాపు 70రోజుల పాటు ఎడతెగని ఉత్కంఠను రాజేసిన వివాదంపై చైనా ఇంత అకస్మాత్తుగా ఎందుకు మనసు మార్చుకుంది?.
డోక్లామ్లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా
భారతే తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చి లేని ప్రేలాపనలు చేస్తోందంటూ మండిపడ్డ చైనా.. ఇప్పుడు మాత్రం ఎందుకు స్నేహ హస్తం దిశగా ఆలోచనలు చేస్తోంది. సమాధానం ఒక్కటే.. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి, త్వరలో బ్రిక్స్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ద్వంద్వ నీతి పనికిరాదన్న అవగాహనే చైనాను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందంటున్నారు.
ద్వంద్వ నీతిని పక్కనపెట్టి:
సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు చైనాలోని జియామెన్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఇందులో భాగస్వాములుగా ఉన్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు సదస్సులో పాల్గొంటాయి. 'మెరుగైన భవిష్యత్తుకు బలమైన భాగస్వామ్యం' అన్న కాన్సెప్టుతో ఈసారి సదస్సును నిర్వహించనున్నారు.
ఓవైపు భారత్ తో కొర్రీలు పెట్టుకుంటూనే.. బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించాలన్న సదస్సులకు వేదికగా నిలవడం చైనాను ఇరకాటంలో పడేసింది. ఈ వైఖరి ప్రపంచ దేశాల ముందు తమ ద్వంద్వ నీతిని స్పష్టం చేసేదిగా ఉండటంతో.. చైనా డోక్లాం వివాదం నుంచి వెనక్కి తగ్గింది.
మోడీ హాజరుకారేమోనన్న భయం:
డోక్లాం వివాదంలో చైనా వైఖరిపై భారత్ తీవ్ర అసంత్రుప్తితో ఉంది. అటు పరిష్కారం వెతకకుండా, ఇటు సంయమనం వహించకుండా.. భారత్ పై అక్కసు వెళ్లగక్కుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తుండటంతో.. ప్రధాని మోడీకి చైనాపై ప్రపంచ దేశాలకు తెలిసేలా నిరసన తెలిపే అవకాశం చిక్కింది.
సరిగ్గా.. చైనా కూడా ఇదే ఆలోచించింది. అంతర్జాతీయ వేదిక మీద మోడీ ఆ పని చేసినా.. లేక సదస్సుకే గైర్హాజరు అయినా.. అది తమ దేశానికే నష్టం అని చైనా ఆలోచించింది. ఈ లేనిపోని తలనొప్పిలు కొని తెచ్చుకోవడం కంటే.. డోక్లాం విషయంలో సంయమనం పాటించడమే నయం అన్న నిర్ణయానికి వచ్చింది. ఆవిధంగా డోక్లాం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంది.
అంతర్జాతీయ చట్టాల రీత్యా:
ద్వంద్వ నీతి వ్యవహారంతో పాటు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కూడా చైనాను కలవరపెట్టింది. వివాదాస్పద భూభాగంగా ఉన్న డోక్లాం విషయంలో శాశ్వత పరిష్కారం వెతకకుండా.. ఉద్రిక్తతలకు తావిచ్చేలా యథాతథస్థితికి భంగం కలిగించడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి ఇదే వైఖరితో దుందుడుగా వ్యవహరిస్తే ప్రపంచం ముందు చేతులు కట్టుకుని నిలుచోక తప్పదు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన చైనా వెనక్కి తగ్గడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చింది.
దీనికి తోడు చైనా మీడియా భారత్ పట్ల వ్యవహరించిన తీరు కూడా అంతర్జాతీయంగా చైనాపై విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఉత్తరకొరియా వ్యవహారం కూడా తలనొప్పిగా తయారైంది. అమెరికా ఒత్తిడితో ఆ దేశానికి ఎగుమతులు దిగుమతులు నిలిపేయాలన్న ఆంక్షలు చైనాను అతలాకుతలం చేశాయి.
ఆర్థికంగా నష్టమే అయినప్పటికీ ఐరాస ఆదేశాలతో చైనాకు దాన్ని అమలు చేయక తప్పలేదు. ఆంక్షలు ఎత్తివేయాలని చైనా వాదిస్తున్నప్పటికీ.. ఐరాస ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇలా ఎటు చూసినా ప్రతికూల పరిస్థితులే వెంటాడుతున్న నేపథ్యంలో భారత్ తో కయ్యానికి కాలు దువ్వే ఆలోచనను చైనా విరమించుకుంది.
అదంతా మేకపోతు గాంభీర్యమే:
ఇంత జరిగినా.. డోక్లాంలో మా గస్తీ కొనసాగుతుందంటూ చైనా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం గమనార్హం. భూటాన్ ట్రై జంక్షన్ లోని డోక్లాం వద్ద నిర్మిస్తున్న రోడ్డు గురించి మాట్లాడకుండా.. గస్తీ కొనసాగుతుందంటూ వ్యాఖ్యలు చేయడం దీన్ని స్పష్టం చేస్తోంది. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో సీపీఈసీనిర్మాణం చేపట్టింది.
సరిహద్దు వెంబడి భారత్ కూడా బలంగా ఉంది. అదే సమయంలో అమెరికా పరోక్షంగా భారత్ కు మద్దతు తెలపడం, జపాన్ నేరుగానే చైనాను తప్పుపట్టడం చైనాను అంతర్మథనంలో పడేశాయి. ఇలాంటి స్థితిలో యుద్దం ఆలోచన తమకే చేటు చేస్తుందని గ్రహించింది. దీంతో ఎట్టకేలకు డోక్లాం వివాదంలో చైనా తాత్కాళికంగానైనా తోక ముడవక తప్పలేదు.