జగన్ మీడియా తేల్చేసింది?: కానీ ఆ విషయం మరిచి.. బాబు వైపు కూడా అంతే!
టీడీపీ, వైసీపీ రెండు పార్టీల అనుకూల మీడియాలు ఈ విషయంలో పోటీ పడుతున్నాయి.
కర్నూలు: నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో టీడీపీ-వైసీపీలు పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ప్రత్యర్థి పార్టీకి ఉన్న మీడియా బలం తనకు లేదని, తనకున్న ఆస్తి విశ్వసనీయతే అని జోరుగా ప్రచారం చేస్తున్నారు.
తనకు చానెల్స్, పేపర్స్ బలం లేదని జగన్ చెబుతున్నప్పటికీ.. ఆయన అనుకూల మీడియా మాత్రం వైసీపీ అనుకూల కథనాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబుపై జగన్ చేస్తున్న ఘాటు విమర్శలకు ఈ కథనాలు ఎంతమేర దోహదపడుతాయో అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
ఇదీ లెక్క: బాబు-జగన్లకు ఒకే ఫలితం.. సర్వేల్లో జనం ఇలా తేల్చారట?
అటు టీడీపీ అనుకూల మీడియా కూడా ఆ పార్టీకి లాభం చేకూర్చే కథనాలను వండి వారుస్తున్నట్లే కనిపిస్తోంది. దీంతో మొత్తం మీద ఈ రెండు పార్టీల మధ్య పోటీ రెండు మీడియా వర్గాల మధ్య పోటీగాను మారింది.
ఆది నారాయణతో దెబ్బే, తేల్చేసింది:
టీడీపీ నేతల అసహనం, ఆధిపత్య అహంకారంతో ఆ పార్టీకి దెబ్బేనని జగన్ మీడియా అభిప్రాయపడుతోంది. ఇందుకు ఆది నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా చెబుతోంది. కీలక ఉపఎన్నిక సమయంలో ఆది నారాయణ రెడ్డి నోరు జారడం ఆ పార్టీకి ఎంతో కొంత చేటు చేసే అంశమే.
నంద్యాలలో ముస్లింలతో పాటు ప్రభావవంతంగా ఉన్న ఎస్సీ సామాజికవర్గం దూరమైతే టీడీపీకి కష్టాలు తప్పవు. అయితే జగన్ వర్గం ఈ పాయింట్ ను బాగానే క్యాచ్ చేసింది కానీ అదే సమయంలో జగన్ సీఎం చంద్రబాబుపై చేస్తున్న వ్యాఖ్యలను విస్మరిస్తే ఎలా అంటున్నారు జనం.
అంతేకాదు, డబ్బులు చెల్లించి మరీ కార్యకర్తలను తరలిస్తున్న దుస్థితిలో టీడీపీ ఉందని, ఇలాంటి స్థితిలో ఆ పార్టీకి ఇక గెలుపు అసాధ్యమన్నట్లుగానే కథనం వెలువరించింది.
Recommended Video
రెండూ రెండే:
ఇటు మంత్రి ఆది నారాయణ చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని టీడీపీ.. జగన్ వ్యాఖ్యల విషయంలో మాత్రం పెద్దగా ఫోకస్ పెట్టడం కూడా ఈ రెండు పార్టీల తీరును జనానికి చెప్పకనే చెబుతోంది. తమ వైపు నుంచి ఉన్న తప్పులను సరిదిద్దుకోరు కానీ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం వీరికి అలవాటుగా మారిపోయింది.
మీడియా పోరు:
టీడీపీ-వైసీపీ మధ్య పోరు కాస్త ఈ రెండు వర్గాల మధ్య మీడియా పోటీకీ దారి తీసింది. తామేమి తక్కువ తినలేదన్నట్లు ఒకరిని మించి ఒకరు.. ప్రత్యర్థి వర్గాలను టార్గెట్ చేస్తూ కథనాలను ప్రచురిస్తున్నారు. ఒక విధంగా ఉపఎన్నికకు ఈ మీడియా వర్గాలు కరపత్రాలుగా పనిచేస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీడీపీకి ఓటమి తప్పదా? అంటూ వైసీపీ కథనాలు ప్రచురించడం.. అదే సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా అటు నుంచి కథనాలు వెలువడటం.. ఈ రెండు వర్గాల మధ్య పోటీ తీవ్రతను తెలియజేస్తోంది.
జనం ఎవరి వైపు?:
పార్టీలు, మీడియా మాట ఎలా ఉన్నా.. జనం ఎవరి వైపు ఉన్నారన్న దానిపైనే నంద్యాల గెలుపు ఆధారపడి ఉంది. ఇరు పార్టీల ప్రచారాల్లోను జనం పెద్ద ఎత్తున్నే కనిపిస్తున్నప్పటికీ.. ఇందులో ఎవరి తరుపున జనం స్వచ్చందంగా పాల్గొంటున్నారు?.. డబ్బులు తీసుకుని వచ్చేవాళ్లు ఎంతమంది అన్నది వాళ్లకే తెలియాలి. ఇప్పటికైతే జనం మా వెంటే అని రెండు వర్గాలు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. ఎన్నిక పూర్తయితే తప్పితే గెలుపు మొగ్గు ఎటువైపు ఉందో చెప్పడం కష్టం.