‘అయ్యా! పన్నీరు... ఎప్పటికీ మీరే మా ముఖ్యమంత్రి’: ఊహించని మద్దతు
పన్నీరుకు మరో ఊహించని వ్యక్తి నుంచి కూడా మద్దతు లభించింది. పన్నీరుకు చిన్నతనంలో చదువు చెప్పిన గురువు సతీమణి తన మద్దతు తెలుపుతూ ఓ లేఖ రాశారు.
చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పళనిస్వామి బాధ్యతలు చేపట్టినప్పటికీ.. తమిళ ప్రజలు మాత్రం మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకే మద్దతుగా నిలుస్తున్నారు. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లిన ఆమె ఆశీస్సులతో పళనిస్వామి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే.
అయితే, ప్రజలు, సినీ ప్రముఖులు పన్నీరు సెల్వంకే మద్దతు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ పన్నీరు సెల్వంకు మద్దతు పలుకుతూ తమిళ యువత పోస్టులు, ట్వీట్లు పెడుతుండటం గమనార్హం. కాగా, పన్నీరుకు మరో ఊహించని వ్యక్తి నుంచి కూడా మద్దతు లభించింది. పన్నీరుకు చిన్నతనంలో చదువు చెప్పిన గురువు సతీమణి తన మద్దతు తెలుపుతూ ఓ లేఖ రాశారు.
దిండుకల్ జిల్లా నత్తం ప్రాంతానికి చెందిన ఎస్కెఎ ఈశ్వరి అమ్మాళ్ ఓ తమిళ దిన పత్రికకు పన్నీర్సెల్వాన్ని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాశారు. అందులో 'అయ్యా! పన్నీరు... ఎప్పటికీ నువ్వే మా ముఖ్యమంత్రి...' అని పేర్కొన్నరామె.
ఇంకా 'మీ ఉపాధ్యాయుడు ఎస్కెఎ అయ్యాస్వామి వద్ద ట్యూషన్ చదువుకోవడానికి మా ఇంటికి మీరు వచ్చారు. మిగతా విద్యార్థులు అల్లరి చేస్తుంటే మీరు మాత్రం బుద్ధిగా చదువుకునేవారు. మీ ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్నలకు మెల్లగా సమాధానం చెప్పేవారు. అడిగే ప్రశ్నలకు 'సరి లేదా కాదు' అంటూ తలను మాత్రమే ఆడించేవారు' అంటూ పన్నీరు గురించి చెప్పుకొచ్చారు.
'ఉపాధ్యాయుడికి మీరు బాగా నచ్చడంతో మిగతా విద్యార్థులను గమనించే బాధ్యతనూ ఆయన మీకే అప్పజెప్పారు. మీరు పాఠశాల జీవితాన్ని ముగించుకుని వెళ్లేటప్పుడు మీ ఉపాధ్యాయుడు మీకు కొన్ని సూచనలు చేశారు' అని గుర్తు చేశారు.
'ఎవరి వద్ద మాట్లాడినా గంభీరంగా మాట్లాడాలని, వంగి ఉండకూడదని, గట్టిగా సమాధానం చెప్పాలని, మౌనస్వామిగా ఉండకూడదని సూచించారు. మీ జీవితంలో పలు మార్పులు జరిగాయి. జయలలిత ఆదరాభిమానాలు, విశ్వాసాన్ని చూరగొన్నారు. జయలలిత మరణం తర్వాత మంచి పాలన కొనసాగించాలన్నారు' అని ఆ ఉపాధ్యాయుడి భార్య తన లేఖలో పన్నీరు ఉద్దేశించి రాశారు. ప్రస్తుతం ఈ లేఖ తమిళనాట ఆసక్తిరంగా మారింది.