గిద్దలూరు-నంద్యాల ఘాట్ రోడ్డులో అసలేం జరిగింది?: ఉపఎన్నిక హీట్ పెంచిన 'ప్యాంట్రీ' ఎపిసోడ్
ఎన్నికల వేళ ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు సహజమే అయినప్పటికీ.. నంద్యాలలో అవి తారాస్థాయికి చేరినట్లే కనిపిస్తున్నాయి.
కర్నూల్: నంద్యాల ఉపఎన్నికలో ప్రలోభాల ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. డబ్బు పంపిణీతో ప్రజలను తమవైపు తిప్పుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే.. లేని అభాండాలతో తమపై కుట్ర చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
బాబు ప్యాంట్రీ వాహనంలో డబ్బు కలకలం.. రివర్స్: 'సీఎం భద్రతకు ముప్పు వాటిల్లేలా, కుట్రకోణం'
సీఎం పర్యటనకు ముందు డబ్బు పంపిణీ ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేయడం ఒకరకంగా వైసీపీకి కలిసొచ్చే అంశంగానే కనిపిస్తోంది. టీడీపీపై వస్తున్న ఈ ఆరోపణను జనం నమ్మితే ఆ పార్టీకి కష్టాలు తప్పవు. మరోవైపు 'కంటెయినర్లో నోట్ల కట్టలు' తరలిస్తున్నారనంటూ సాగిన ప్రచారంలో పలు ఆసక్తికర కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.
గిద్దలూరు-నంద్యాల ఘాట్ రోడ్డులో ఏం జరిగింది?:
గాజులపల్లె మెట్ట శివార్లలో సీఎం ప్యాంట్రీ వాహనానాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేసి.. అందులో డబ్బు ఏమి లేదని తేల్చినప్పటికీ.. ఊహాగానాలకు మాత్రం తెరపడలేదు. నిజానికి ఈ ప్యాంట్రీ వాహనంలో డబ్బు ఉన్న మాట వాస్తవమేనని, కానీ గిద్దలూరు నుంచి నంద్యాలకు వచ్చే దారిలో ఉన్న ఘాట్ రోడ్డును తమకు అనుకూలంగా మార్చుకుని అక్కడే డబ్బు మార్పిడి తతంగమంతా నడిపించారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
నిజమేనా?:
గిద్దలూరు-నంద్యాల ఘాట్ రోడ్డులో దాదాపు అరగంట పాటు ప్యాంట్రీ వాహనాన్ని నిలిపి.. ముందస్తు ప్లాన్ లో భాగంగా అదే దారిలో వచ్చిన వోల్వో బస్సులోకి డబ్బు మార్పిడి చేసి తరలించారన్న వార్త స్థానికంగా జోరుగా వినిపిస్తోంది. ఈ దారంతా ఎక్కడా లైట్లు కూడా లేకపోవడంతో.. ఈ తతంగమంతా నడిచిపోయిందంటున్నారు.
టీడీపీని దెబ్బతీయడానికా!:
ప్యాంట్రీ వాహనంలో డబ్బు తరలించారన్నది ఎంత నిజమో తెలియదు కానీ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేయడంలో వైసీపీ సఫలమైంది. ఇది టీడీపీకి ప్రతికూలంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీని చుట్టూ వినిపిస్తున్న ఊహాగానాలన్ని టీడీపీకి నష్టం చేకూర్చేవిగానే ఉన్నాయి. నిజనిజాలతో సంబంధం లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రావడం ఎన్నికల వేళ టీడీపీకి కొత్త కష్టాలను తెచ్చినట్లయింది.
టీడీపీ మూడు అస్త్రాలంటూ వైసీపీ:
నైతికంగా ఎన్నికల్లో గెలవలేకనే టీడీపీ అడ్డదారిలో మూడు అస్త్రాలు ప్రయోగిస్తోందని జగన్ అనుకూల మీడియా ఆరోపిస్తోంది. డబ్బు, దౌర్జన్యాలు, అభాండాల ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలన్నదే టీడీపీ ప్లాన్ అని ఆ వర్గం ఆరోపణలు చేస్తోంది. వైసీపీ సభలు, సమావేశాలకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తుండటం చూసి, వారిని భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలాంటి ఎత్తులు వేస్తోందనేది వారి వాదన.
తారాస్థాయి ఫైట్.. బాబు రియాక్షన్పై ఆసక్తి:
ఎన్నికల వేళ ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు సహజమే అయినప్పటికీ.. నంద్యాలలో అవి తారాస్థాయికి చేరినట్లే కనిపిస్తున్నాయి. శనివారం సీఎం పర్యటన ఉండటంతో దీనిపై ఆయనెలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు.. ప్యాంట్రీలో డబ్బు తరలిస్తున్నారన్న ఆరోపణపై ఆయన ఘాటుగా స్పందించే అవకాశం ఉంది. మొత్తం మీద నంద్యాలలో వైసీపీ-టీడీపీ ఫైట్ మరింత రసకందాయంలో పడిందనే చెప్పాలి. ఎవరి ఎత్తుల్లో ఎవరు చిత్తవుతారన్నదే ఫైనల్గా గెలుపోటములను నిర్ణయించనుంది.