చంద్రబాబుకు నో చాన్స్: వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి రాజీనామా?
హైదరాబాద్: వచ్చే 48 గంటల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయంగా హై డ్రామాకు తెర తీసే అవకాశాలు ఉన్నాయి. తమ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు.
తనపై చంద్రబాబు వేటు వేయడానికే ముందే రాజీనామాస్త్రం సంధించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తనపై వేటు వేయడానికి ముందే ఆయన పార్టీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు మంగళవార విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత సంభవించే పరిణామాలను బట్టి కూడా రేవంత్ రెడ్డి వ్యూహం ఉండవచ్చునని భావిస్తున్నారు.
చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత...
చంద్రబాబు తిరిగి వచ్చిన మరుక్షణమే తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తే వెంటనే తనను బహిష్కరిస్తారనే అంచనాకు రేవంత్ రెడ్డి వస్తారని, తిరిగి వచ్చిన వెంటనే చంద్రబాబు తనకు ఆపాయింట్మెంట్ ఇవ్వకున్నా తనపై వేటు తప్పదని భావిస్తారని అంటున్నారు. అప్పుడు వెంటనే టిడిపికి రాజీనామా లేఖ సమర్పించాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
పయ్యావుల కేశవ్ విమర్శల నేపథ్యంలో....
రేవంత్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకుడు పయ్యావుల కేశవ్ సోమవారంనాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. అందువల్ల చంద్రబాబు అనుమతి లేకుండా పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డి అంత దూకుడుగా వ్యవహరిస్తారని ఎవరూ భావించడం లేదు.
చంద్రబాబు వైఖరి క్లియర్
పయ్యావుల కేశవ్ దూకుడుతోనే చంద్రబాబు ఆలోచన ఏమిటో అర్థమైందని అంటున్నారు. రేవంత్ రెడ్డిపై బహిష్కరణ వేటు వేయాలనే కచ్చితమైన ఆలోచనతోనే ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పయ్యావుల కేశవ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, అదే సమయంలో రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని తెలంగాణ నాయకులు డిమాండ్ చేశారని అంటున్నారు.
కవిత పేరు ఎత్తి....
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు, పార్లమెంటు సభ్యురాలు కవితతో కలిసి రేవంత్ రెడ్డి ఓ కంపెనీని స్థాపించడానికి పూనుకున్్నారని, అయితే అది కార్యరూపం దాల్చలేదని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. చంద్రబాబు ప్రధానమైన పదవులు ఇచ్చినప్పటికీ స్వార్థ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి టిడిపిలో పనిచేస్తున్నారని ఆయన విమర్సించారు.
రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా....
రేవంత్ రెడ్డి ఎవరినీ కలవడానికి ఇష్టపడడం లేదు. మీడియాకు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఆయన ఇప్పుడు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత సంభవించే పరిణామాలను గమనించిన తర్వాతనే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతారని చెబుతున్నారు.