ఏకాంత భేటీల అవసరమేంటి?; తప్పేముందన్న కేశవ్, కేసీఆర్ అనంత ఎపిసోడ్ చిచ్చు
పెళ్లికి అందరి లాగే అతిథిలా వచ్చానని, మధ్యలో కేసీఆర్ పిలిస్తే వెళ్లానని పయ్యావుల చెప్పారట.
అమరావతి: అవసరమైతే టీఆర్ఎస్ తో జతకడుతామని ఓవైపు మోత్కుపల్లి లాంటి టీడీపీ సీనియర్ నాయకులు చెబుతుండటం.. మొన్నటి అనంతపురం పర్యటనలో అక్కడి టీడీపీ నేతలు కూడా సీఎం కేసీఆర్ పట్ల ప్రత్యేక శ్రద్ద చూపించడం.. మొత్తంగా టీడీపీ-టీఆర్ఎస్ మధ్య ఏదో జరుగుతోంది అన్న సంకేతాలను పంపించింది.
తొందరపడ్డారు:కెసిఆర్-పయ్యావుల రహస్య భేటీపై బాబు సీరియస్
అయితే ఈ పరిణామాలు రుచించని తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, రమణ తమ అధినేత చంద్రబాబుకు గట్టిగానే ఫిర్యాదు చేశారు. ఇలా అయితే తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమై పోవాలి? అని ఆవేదన చెందారట. వారి ఆవేదన నిజమేననుకున్న చంద్రబాబు.. అనంతపురం ఎపిసోడ్ లో కేసీఆర్ తో పయ్యావుల వ్యవహారంపై సీరియస్ గా స్పందించారట.
బాబు ఏమన్నారు:
కేసీఆర్ తో మరీ అంత సాన్నిహిత్యంగా మెలగాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు మందలించినట్లు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ నేతలు ఈ ఎపిసోడ్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, అక్కడివారి మనోభావాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా.. అని అభిప్రాయపడ్డారట. పార్టీ నేతలు పరిధికి మించి సాన్నిహిత్యం ప్రదర్శించారని మండిపడ్డారట.
సీనియర్ నాయకుడై ఇలానా?:
పయ్యావుల కేశవ్.. పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధాన కార్యదర్శి అయి ఉండి ఇలా వ్యవహరించడం ఏమాత్రం బాగా లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేసీఆర్తో ఏకాంత భేటీల అవసరమేముంది?, సీనియర్ నేతలే ఇలా చేస్తే ఎలా? అంటూ ప్రశ్నించారట. అంతేకాదు, ఇలాంటి పరిణామాలతో తెలంగాణ టీడీపీ నేతలు రాజీనామా వరకు వెళ్తే ఏం చేస్తామని నిలదీశారట.
నా తప్పేముంది?: కేశవ్
కేసీఆర్తో జరిగిన ఏకాంత భేటీలో తన తప్పేమి లేదని పయ్యావుల కేశవ్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సీఎం తనను తప్పు పట్టడంపై మనస్తాపానికి గురైనట్లు సమాచారం. మొత్తం వ్యవహారంలో తాను చేసిందేమి లేదని, కేసీఆర్ పిలిస్తేనే వెళ్లానని చెప్పారట.పెళ్లికి అందరి లాగే అతిథిలా వచ్చానని, మధ్యలో కేసీఆర్ పిలిస్తే వెళ్లానని పయ్యావుల చెప్పారట.
కేసీఆర్ కబురు పెట్టినందుకే:
తొలుత మర్యాదపూర్వకంగా ఓ నమస్కారం పెట్టి అక్కడినుంచి వెళ్లిపోయానని, కేసీఆర్ ఓ పోలీస్ అధికారితో కబురు పంపించడంతో, పిలిచినప్పుడు వెళ్లకపోతే బాగుండదని తాను వెళ్లినట్లు చెప్పుకొచ్చారట. ఆపై కేసీఆర్ తన చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారని వివరించారట. సీఎంకు సరైన సమాచారం అందకపోవడం వల్లే మాట పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారట.