అన్నాడీఎంకేను ఇరుకునపెట్టిన 'జయ కూతురు': ఎవరీ అమృత?
దివంగత తమిళనాడు సీఎం సీఎం జయలలిత మరణించి తొమ్మిది నెలలు అవుతోంది. ఇప్పుడు నేను ఆమె బిడ్డను అంటూ అమృత అనే యువతి బయటకు వచ్చారు.
చెన్నై: దివంగత తమిళనాడు సీఎం సీఎం జయలలిత మరణించి తొమ్మిది నెలలు అవుతోంది. ఇప్పుడు నేను ఆమె బిడ్డను అంటూ అమృత అనే యువతి బయటకు వచ్చారు. ఆమె ఎన్నో సందేహాలను, మరెన్నో అనుమానాలను రేపారు.

అన్నాడీఎంకే మల్లగుల్లాలు
ఇప్పటికే జయలలిత రాజకీయ వారసత్వం, ఆస్తుల వారసత్వంపై పార్టీలో, ప్రభుత్వంలో, బంధువుల్లో రచ్చ జరుగుతోంది. ఇది చాలదన్నట్లుగా జయలలితే మా అమ్మ అంటూ తెరపైకి వచ్చిన అమృత వివాదాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అన్నాడీఎంకే మల్లగుల్లాలు పడుతోంది.

అమృత ప్రకటనతో వారిలో వణుకు
తాను డిఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధమని అమృత ప్రకటన చేసింది. చేసిన ప్రకటన వారిని వణికిస్తోంది. అమృత చెప్పేది అబద్ధమంటూ ఆమెను ఢీకొట్టాలా, తమలో కలుపుకోవాలా ఈ విషయాన్ని పక్కన పెట్టేయాలా అనే దానిపై ఒకటీ రెండు రోజుల్లో సీఎం ఎడప్పాడి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

నాడు నోరు మెదపని జయలలిత
జయలలిత, శోభన్ బాబు సన్నిహితంగా ఉండేవారనే వాదనలు ఉన్నాయి. వారిద్దరికీ ఓ ఆడపిల్ల కూడా పుట్టిందని, ఆమె హైదరాబాద్లోనో, మరెక్కడో జీవిస్తోందన్న వదంతులు కూడా ఉన్నాయి. జయ, శోభన్ బాబు సన్నిహితంగా ఉన్న ఫోటోలను 2010లో డీఎంకే బయటపెట్టింది. జయ దీనిపై నోరు మెదపలేదు. తాను వారి బిడ్డనని అమృత చెబుతోంది.

ఎవరీ అమృత?
అమృత బెంగళూరు శివారులోని కెంగేరిలో ఉంటున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆమె ఓ ప్రయివేటు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1996లో తాను జయను మొదటిసారిగా కలుసుకున్నట్లు ఇటీవల ప్రధానికి రాసిన లేఖలో అమృత పేర్కొన్నారు. దానిని పోయెస్ గార్డెన్ వర్గాలూ ధ్రువీకరించాయి. 1996-98 ప్రాంతంలో జయ అధికారం కోల్పోయి పలు కేసుల్లో ఇరుకున్నపుడు అమృత వచ్చిన మాట వాస్తవమేనని పేర్కొన్నాయి. కొన్ని రోజుల పాటు ఆమె పోయెస్ గార్డెన్లో ఉన్నారని చెబుతున్నారు. ఆ తర్వాత ఆమె ఒక టీ రెండుసార్లు మాత్రమే పోయెస్ గార్డెన్కు వచ్చారని అంటున్నారు.

జయలలిత మృతి తర్వాత...
జయలలిత మరణం తర్వాత అమృ త కొన్ని కన్నడ, తమిళ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కుటుంబం గురించి బయటి ప్రపంచానికి తెలియడం జయలలితకు ఇష్టం ఉండదని, ఆమెతో ఎంత దగ్గరి బంధుత్వమున్నా బయటకు చెప్పుకోలేని దీనస్థితి మాది అని అమృత వాపోయారు. అయితే, జయలలిత తనకు పెద్దమ్మ అని మాత్రమే అప్పట్లో చెప్పారు.

అమెరికాలో జననం.. అలా పెరిగారు
అమృత అమెరికాలో జన్మించినట్లుగా ఆమె జన్మ ధ్రువీకరణ పత్రాల్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జయలలితకు వరుసకు సోదరి అయ్యే శైలజ దంపతుల కుమార్తెగా ఆమె పెరిగారు.

జయలలిత పెద్దమ్మ కూతురు శైలజ
అమృత జన్మించే నాటికి శైలజ దంపతులు అమెరికా వెళ్లలేదని చెబుతున్నారు. కాగా, పురిటిబిడ్డగా ఉన్నప్పుడే జయలలిత తనను శైలజకు అప్పగించారని ప్రధానికి రాసిన లేఖలో అమృత చెప్పారు. తిరుచ్చి జిల్లా శ్రీరంగానికి చెందిన జయలలిత తాత (వేదవల్లికి తండ్రి) రంగస్వామి అయ్యంగార్ హిందుస్థాన్ ఏరో నాటికల్ లిమిటెడ్ సంస్థలో పని చేసేందుకు మైసూరు వెళ్లారు. ఆయనకు కుమారుడు, ముగ్గు రు కుమార్తెలు అంబుజవల్లి, వేదవల్లి, పద్మవల్లి జన్మించారు. ముగ్గురు కుమార్తెల్లో పెద్దదైన అంబుజవల్లి కుమార్తే శైలజ. అంటే జయ పెద్దమ్మ కుమార్తె శైలజ. వరుసకు సోదరి.

అన్నాడీఎంకేకు కొత్త తలనొప్పి
అమృత ప్రకటనతో అన్నాడీఎంకేను ఇరకాటంలో పడేసిందని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఎలా స్పందించాలో తెలియడం లేదని వాపోతున్నారని తెలుస్తోంది. వారసత్వ పోరాటం ఎలాగున్నా ఈ వ్యవహారం జయ జీవితానికి మచ్చ తెచ్చిపెట్టేలా ఉందని, అందువల్ల ఇది పెద్దది కాకుండా చూడడమే తమ కర్తవ్యమన్నారు. జయ ఆస్తుల కోసం కొట్లాడుతున్న ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్లు కూడా అమృత ప్రకటన పట్ల మౌనం దాల్చడం గమనార్హం.












Click it and Unblock the Notifications