‘ఐ లవ్ మై పూజ.. ఈ ప్రేముందే..’: జవాబు పత్రంలో తన లవ్ స్టోరీ రాసిన విద్యార్థి
లక్నో: పరీక్షలు వచ్చాయంటే బాగా చదివిన విద్యార్థులే కొంత ఆందోళన చెందుతుంటారు. ఇక చదవని విద్యార్థులైతే ఇతర మార్గాలను ఎంచుకుంటుంటారు. ఇక్కడ కూడా ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి వింత మార్గాన్ని ఎంచుకున్నాడు.
తను ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయి ప్రేమలో పడి పరీక్షలు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని ఏకంగా జవాబు పత్రంలోనే రాసేశాడు. అంతేగాక, తనను పాస్ చేయాలంటూ వేడుకున్నాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఈ ప్రేమ ఉందే..
‘ఐ లవ్ మై పూజ' అంటూ ఆ విద్యార్థి తన కెమిస్ట్రీ పరీక్ష జవాబు పత్రంపై రాయడం గమనార్హం. అంతేగాక, ‘ఈ ప్రేమ చాలా చిత్రమైనది. ఇది బతకనీయదు...చావనీయదు. ఈ ప్రేమకథ వల్ల పరీక్షలకు నేను సన్నద్ధం కాలేకపోయాను....నన్ను మీరే పాస్ చేయాలి ' అంటూ ఆ విద్యార్థి తన జవాబు పత్రంలో రాశాడు.
అంతా ప్రేమాయణమే..
జవాబు పత్రంలో తన ప్రేమ రామాయణం, లవ్ సింబల్ తప్ప మిగిలిందంతా ఖాళీగా విడిచిపెట్టాడు. అతను మాత్రమే గాక యూపీలో ఇటీవల కాలంలో ఇలాంటి పిచ్చి ప్రేమరాతలే కాక చిత్రవిచిత్రమైన సందేశాలు రాస్తున్న విద్యార్థులు ఎక్కువైపోతున్నారట.
Recommended Video
కరెన్సీ నోట్లు కూడా
కాగా, దీనిపై ముజఫర్నగర్ జిల్లా పాఠశాలల తనిఖీ అధికారి మునేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులు తమ జవాబు పత్రాలతో పాటు కరెన్సీ నోట్లను జత చేస్తున్నారు. కొన్ని వినతిపూర్వకమైన సందేశాలను కూడా రాస్తున్నారు' అని చెప్పారు.
వీళ్లనేం చేయాలి..?
ఇది ఇలావుంటే.. మరో విద్యార్థి ‘నాకు అమ్మ లేదు. మీరు నన్ను ఫెయిల్ చేస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు' అంటూ జవాబు పత్రంపై అభ్యర్థించాడని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో చదువుపై ధ్యాస పెట్టకుండా పరీక్షల సమయంలో ఇలాంటి రాతలు రాస్తున్న విద్యార్థులను ఎలా దారిలోకి తీసుకురావాలన్న దానిపై విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.