బాబుతో భేటీకి మోత్కుపల్లి డుమ్మా: నారా ఫ్యామిలీ దూరమే
Recommended Video
హైదరాబాద్: పార్టీ తెలంగాణ నాయకులకు తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో సొంతంగా ఎదగడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు.
చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం సీనియర్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణ పార్టీ కోసం తాము ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం లేదని, ఈ ప్రాంత నేతలే పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించాలని ఆయన చెప్పారు.
తెలంగాణ నేతలకు నిరాశనే...
తెలంగాణ పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్కు గానీ, నారా బ్రాహ్మణికి గానీ అప్పగించాలనే డిమాండ్ కొంత మంది నాయకుల నుంచి వచ్చింది. అయితే, వారికి చంద్రబాబు నిరాశనే మిగిల్చారు. తెలంగాణ పార్టీకి నారా కుటుంబ సభ్యులెవరూ నాయకత్వం వహించబోరని ఆయన తేల్చి చెప్పారు.
ఎపి వ్యవహారాలతో బిజీగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున చంద్రబాబు తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. గతంలో ఆయన కుమారుడు నారా లోకేష్ తెలంగాణ వ్యవహారాలపై దృష్టి సారించి పార్టీని నడిపించాలని ప్రయత్నించారు. అయితే, జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీ ఘోరమైన ఫలితాన్ని చవి చూసింది. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవి చేపట్టారు. దీంతో ఆయన కూడా తెలంగాణ పార్టీకి దూరమయ్యారు.
తెలంగాణలో పొత్తులపై
తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలంటే పొత్తులు తప్పవని చంద్రబాబు భావిస్తున్నారు. తెలంగాణ నాయకులు తమకు తాము ఎదగడానికి ప్రయత్నిస్తూ తెలంగాణలో ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు. భావసారూప్యం గల పార్టీలతో పొత్తులపై లేదా సీట్ల సర్దుబాటుపై తాను తగిన సూచనలు చేస్తానని ఆయన చెప్పారు. మేలో జరిగే మహానాడుకు ముందు తెలంగాణలో మినీ మహానాడు నిర్వహించాలని, దానికి తాను హాజరవుతానని ఆయన చెప్పారు. ఆ తర్వాత అమరావతికి బయలుదేరి వెళ్లారు.
తెలంగాణ నాయకుల్లో అసంతృప్తి
తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత మంది పాలక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి, కాంగ్రెసులోకి వలసలు వెళ్లారు. టిడిపిలో ఇప్పటికీ అలాగే ఉన్న నాయకులు అంత సంతృప్తికరంగా లేరు.. చంద్రబాబు నాయకత్వంలోనో, ఆయన కుటుంబానికి చెందిన సభ్యుల నాయకత్వంలోనో పనిచేయడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ నాయకత్వంలో పనిచేయడానికి వారు అంత ఆసక్తి చూపడం లేదనే మాట వినిపిస్తోంది.
భేటీకి మోత్కుపల్లి డుమ్మా....
చంద్రబాబుతో గురువారం జరిగిన సీనియర్ నేతల భేటీకి మోత్కుపల్లి నర్మింహులు హాజరు కాలేదు. తెలంగాణలో టీడిపి పనితీరుపై ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. బుధవారంనాటి సమావేశానికి కూడా ఆయన రాలేదు. చంద్రబాబు నాయుడు క్రియాశీలక పాత్ర పోషిస్తే తప్ప తెలంగాణలో టిడిపికి మనుగడ ఉండదనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
నేతల్లో అయోమయం..
తెలంగాణలో పార్టీకి జవజీవాలు పోయడానికి చంద్రబాబు నిర్దిష్టమైన సూచనలు చేస్తూ సమయం కేటాయిస్తే తప్ప ఫలితం లేదనే అభిప్రాయం అన్ని వైపుల నుంచీ వినిపిస్తోంది. అయితే చంద్రబాబుకు ఆ తీరిక గానీ వెసులుబాటు గానీ లేదు. దానివల్ల తెలంగాణ సీనియర్ నాయకుల్లో అయోమయం నెలకొంది. పార్టీని ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలనే సందిగ్ధతలో వారు కొట్టుమిట్టాడుతున్నారు.
అయితే ఇలా జరగొచ్చు...
తెలంగాణలో టిడిపి టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందని ఇప్పటికే బలమైన సంకేతాలు అందాయి. టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ప్రస్తుతం టిడిపిలో ఉన్న బలమైన నాయకులకు సీట్లు ఇప్పించుకునే వ్యూహాన్ని చంద్రబాబు అనుసరించవచ్చునని అంటున్నారు. దానివల్ల క్రమంగా పుంజుకోవడానికి వీలవుతుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు కేసీఆర్ కూడా పొత్తుకు సుముఖంగానే ఉండడంతో చంద్రబాబు అడిగిన మేరకు సీట్లను, కొన్ని కాకపోయినా కొన్నయినా ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.