దగ్గు మందు, ఇతర సిరప్ అమ్మకాలకు కేంద్రం స్వస్తి
దేశవ్యాప్తంగా ఔషధాల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందుతో పాటు అన్ని రకాల సిరప్ల అమ్మకాలపై ఆంక్షలు విధించింది. మెడికల్ షాపుల్లో నేరుగా వీటిని కొనుగోలు చేయడానికి వీలుండదు. ఇప్పటివరకు అందుబాటులో ఉంటూ వచ్చిన ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ) విధానానికి కేంద్రం స్వస్తి పలికింది. నూతన మార్పులకు సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రకమైన మందులను కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా డాక్టర్లు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ను చూపించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. గత ఏడాది డిసెంబర్ లో విడుదల చేసిన ముసాయిదా ప్రతిపాదనలపై ప్రజలు, పారిశ్రామిక వర్గాలు, నిపుణుల నుంచి అందిన అభిప్రాయాలను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాతే కేంద్రం ఈ తుది నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఔషధాల దుర్వినియోగం తగ్గుతుందని ఆశిస్తున్నారు.

ఈ కఠిన నిబంధనల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 లోని సెక్షన్లు 12, 33 కింద లభించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించింది. దీని ద్వారా డ్రగ్స్ రూల్స్, 1945 లో మార్పులు చేస్తూ డ్రగ్స్ నిబంధనల్లో చట్టబద్ధంగా తాజా సవరణలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా డ్రగ్స్ నిబంధనలలోని షెడ్యూల్ కెే విభాగం నుంచి సిరప్స్ (Syrups) అనే పదాన్ని పూర్తిగా తొలగించింది.
షెడ్యూల్ కే నుంచి ఈ పదాన్ని తొలగించడం వల్ల సిరప్ల విక్రయాలపై ఇప్పటివరకు ఉన్న మినహాయింపులు రద్దయ్యాయి. లైసెన్స్ పొందిన ఆరోగ్య నిపుణులు జారీ చేసిన ప్రిస్క్రిప్షన్ లేనిదే ఏ ఒక్క ఫార్మసీ లేదా మెడికల్ దుకాణదారుడు వినియోగదారులకు ఈ మందులను విక్రయించడానికి చట్టరీత్యా వీలులేదు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే వారి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠినమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
కొద్ది నెలల క్రితం మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నాణ్యత లేని, విషతుల్యమైన కారకాలు కలిసిన సిరప్లను సేవించడం వల్ల పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ దుర్ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి. సిరప్ నాణ్యత ప్రమాణాలు, తయారీ పరిశ్రమలపై ప్రభుత్వ నిఘా లోపించడం వల్లనే ఇలా జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తయారీ నుంచి పంపిణీ దశ వరకు కఠిన నిఘా ఉంచేందుకు ఈ చర్యలు చేపట్టింది.
సాధారణంగా చిన్నపాటి జ్వరం లేదా దగ్గు రాగానే సొంతంగా వైద్యం చేసుకుంటూ నేరుగా మెడికల్ షాపుల నుంచి సిరప్లు కొని వాడేవారి సంఖ్య దేశంలో ఎక్కువే. తాజా నిర్ణయంతో సాధారణ ప్రజలకు కొంత అసౌకర్యం కలిగినా, ప్రాణరక్షణ, ఔషధాల దుర్వినియోగ నియంత్రణ పరంగా ఇది దీర్ఘకాలంలో మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుల ఆరోగ్య భద్రతే పరమావధిగా తెచ్చిన ఈ కొత్త నిబంధనలను ఫార్మసీలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications