తెలంగాణ స్టైల్ "బోటి కర్రీ" ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే..!
తెలంగాణలో మాంసాహార వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మటన్ కర్రీ, బోటి కర్రీ, తలకాయ కూర వంటివి బోనాల విందులో సర్వసాధారణం. అయితే చాలామంది మటన్ బోటి కర్రీని ఎంతో ఇష్టపడతారు. బోటిని శుభ్రం చేయడం కాస్త కష్టమైన పని అయినా.. సరిగ్గా వండితే మాత్రం లొట్టలేసుకుంటూ తినాల్సిందే అనడంలో సందేహం అక్కర్లేదు. ఈ వంటకాన్ని సులభంగా, రుచికరంగా తయారు చేసే విధానం మీకోసం ప్రత్యేకంగా..
బోటి శుభ్రం చేసే విధానం..
బోటి వంటలో ముఖ్యమైన దశ అంటే బోటిని శుభ్రం చేయడమే. గోరువెచ్చని కంటే కొద్దిగా వేడిగా ఉన్న నీటిలో బోటిని 5 నిమిషాలు ఉంచండి. తరువాత కత్తి లేదా చెంచాతో లోపలి జిగురు, బయటి పొర తొలగించాలి. 3-4 సార్లు నీటితో బాగా కడిగి, పసుపు, ఉప్పు వేసి మళ్లీ శుభ్రం చేయండి. ఇలా శుభ్రం చేస్తే బోటికి ఎలాంటి వాసన ఉండకుండా రుచికరంగా ఉంటుంది.

వంటకానికి కావలసిన పదార్థాలు..
- మటన్ బోటి - 500 గ్రాములు (శుభ్రం చేసినవి)
- ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
- పచ్చిమిర్చి - 3 లేదా 4 (మధ్యలోకి చీల్చినవి)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1½ టేబుల్ స్పూన్
- టమాటా - 1 (చిన్నగా తరిగినది)
- కారం పొడి - 1½ నుంచి 2 టేబుల్ స్పూన్లు (కారానికి తగ్గట్టు)
- ధనియాల పొడి - 1½ టేబుల్ స్పూన్
- పసుపు - ½ టీస్పూన్
- గరం మసాలా - 1 టీస్పూన్
- నూనె - 3-4 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర - ఒక గుప్పెడు (సన్నగా తరిగినది)
- పుదీనా ఆకులు - కొద్దిగా (ఐచ్ఛికం)
- నీరు - అవసరమైనంత
తయారీ విధానం..
- ముందుగా శుభ్రం చేసిన బోటిని ప్రెషర్ కుక్కర్లో వేసి, అది మునిగేంత నీరు, కొద్దిగా పసుపు, అర టీస్పూన్ ఉప్పు వేసి ఉడికించాలి. ( 6 నుంచి 8 విజిల్స్ వస్తే సరిపోతుంది )
- బోటి రకాన్ని బట్టి ఉడికే సమయం మారవచ్చు.
- ఉడికిన బోటిని వంపేసి పక్కన పెట్టాలి.
- ఒక మందపాటి కడాయిలో నూనె వేసి వేడి చేయాలి.
- నూనె వేడెక్కాక ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి.
- తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
- టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వండి.
- తరువాత పసుపు, కారం పొడి, ధనియాల పొడి వేసి 1-2 నిమిషాలు నూనె పైకి తేలే వరకు వేయించాలి.
- ఇప్పుడు ఉడికిన బోటిని వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
- 5 నిమిషాలు మసాలాలో వేయించాలి, తద్వారా రుచి బోటికి బాగా అంటుతుంది.
- అవసరమైనంత నీరు పోసి, గరం మసాలా వేసి మూతపెట్టి సన్నని మంటపై 10-15 నిమిషాలు ఉడికించాలి.
- గ్రేవీ చిక్కబడి, నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
ఇక చివరగవ సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని.. వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. కావాలంటే కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. ఈ మటన్ బోటి కర్రీ అన్నంతో పాటు దోసెలు, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు లేదా చపాతీలతో అద్భుతమైన రుచిని అందిస్తుంది.












Click it and Unblock the Notifications