గుండె ఆగిపోయేలా చేస్తున్న ఫుడ్స్! 65% మరణాల ముప్పు..
మనం రోజూ ఎంతో ఇష్టంగా తినే చిప్స్, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన రెడీ-టు-ఈట్ ఆహారాలు (వీటినే అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ - UPF అంటారు) మన ప్రాణాల మీదకు తెస్తున్నాయని తాజా పరిశోధన ఒకటి బాంబు పేల్చింది. యూరోపియన్ కార్డియాలజీ నివేదిక ప్రకారం, ఇవి కేవలం నోటికి రుచి తప్ప ఆరోగ్యానికి అత్యంత హానికరమని తేలింది. వీటిని ఎక్కువగా తీసుకునే వారికి గుండె జబ్బులు, షుగర్, బీపీ రావడమే కాకుండా.. ప్రాణాపాయం కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా కంపెనీలు తమ ఆహార ఉత్పత్తులు "ఆరోగ్యకరం" అని ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ పరిశ్రమల్లో తయారయ్యే ఈ ఆహారాలలో చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు, రసాయనాలు కుప్పలుతెప్పలుగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని జీవక్రియలను దెబ్బతీస్తాయి, లోపల మంటను (Inflammation) కలిగిస్తాయి మరియు మనల్ని ఇంకా ఇంకా తినేలా ప్రేరేపిస్తాయి.

లెక్కలు చెబుతున్న చేదు నిజాలు
యూరోపియన్ హార్ట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే వారిలో.. గుండె జబ్బుల ప్రమాదం 19% ఎక్కువగా ఉంది. గుండె లయ తప్పే (Atrial Fibrillation) ముప్పు 13% ఉంది. గుండె సంబంధిత మరణాల ముప్పు ఏకంగా 65% ఎక్కువగా ఉందని తేలింది.
వైద్యులు ఏమంటున్నారు?
ప్రొఫెసర్ లుయిగినా గుయాస్టీ, డాక్టర్ మారియాలౌరా బొనాషియో వంటి నిపుణుల బృందం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని చెబుతోంది. డాక్టర్ల దగ్గరకు వచ్చే రోగులతో వారు ఏం తింటున్నారు? ఎంతవరకు ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటున్నారు? అనే విషయాలను చర్చించి, వాటిని తగ్గించేలా సలహాలు ఇవ్వాలని సూచించారు. కేవలం పోషకాలను చూడటమే కాదు, ఆహారాన్ని ఎంతగా ప్రాసెస్ చేశారనేది కూడా ముఖ్యమని వారు నొక్కి చెప్పారు.
మనం ఏం చేయాలి?
యూరప్ దేశాల్లో నెదర్లాండ్స్ (61%), యూకే (54%) వంటి దేశాల్లో జనం తమ ఆహారంలో సగానికి పైగా ఈ హానికరమైన వస్తువులనే తింటున్నారు. అందుకే ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తేవాలని, ఆహార పదార్థాల ప్యాకెట్ల మీద స్పష్టమైన లేబుల్స్ ఉండాలని పరిశోధకులు కోరుతున్నారు. సాధ్యమైనంత వరకు తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవడం, ప్యాకెట్లలో దొరికే వస్తువులకు దూరంగా ఉండటమే మన గుండెకు శ్రీరామరక్ష!














Click it and Unblock the Notifications