వెడ్డింగ్ ఫోటోషూట్స్ : హద్దులు దాటుతున్నారా... కెమెరా ముందు రొమాన్స్పై భిన్నాభిప్రాయాలు...
పెళ్లి అనేది జీవితంలో ఒక పెద్ద వేడుక. కాలంతో పాటే ఆ వేడుకలోనూ రకరకాల మార్పులొచ్చాయి. మునుపటి తరంలో కనీసం ఒక్క ఫోటోగ్రాఫ్ కూడా లేని పెళ్లిళ్లే చాలా ఎక్కువ. కానీ ఇప్పటి తరంలో ఫోటోగ్రఫీ,వీడియోగ్రఫీ లేకుండా పెళ్లి తంతు అసలు ముందుకే సాగదు. ఈ ఫోటోగ్రఫీ,వీడియోగ్రఫీలోనూ ఏడెనిమిదేళ్ల క్రితం పెళ్లిళ్లకు ఇప్పటి పెళ్లిళ్లకు చాలా తేడా ఉంది. అప్పట్లో పెళ్లి తంతుకు మాత్రమే ఎక్కువగా వీడియో షూట్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లికి ముందు,పెళ్లి తర్వాత.. ప్రీ-వెడ్డింగ్,పోస్ట్ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ పెరిగింది. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు హద్దులు దాటుతోందా అన్న చర్చ జరుగుతోంది.

చర్చకు దారితీసిన ఆ ఫోటోషూట్...
ఇటీవల కేరళకు చెందిన రిషి-లక్ష్మి అనే కొత్త పెళ్లి జంట పోస్ట్ వెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా పెళ్లిని నిరాడంబరంగా జరుపుకున్న ఈ జంట... పోస్ట్ వెడ్డింగ్ షూట్ను లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకంగా మలుచుకోవాలనుకుంది. ఈ క్రమంలో అందరికంటే కాస్త భిన్నంగా ఫోటోషూట్ చేయాలనుకుంది. ఇందుకోసం ఇడుక్కి టీ ఎస్టేట్స్లో హనీమూన్ ఫోటోషూట్ నిర్వహించారు. ఇద్దరు ఓ తెల్లటి బెడ్షీట్ను చుట్టుకుని... ముద్దులతో,కౌగిలింతలతో ఫోటోలకు పోజులిచ్చారు. మోహంతో ఒకరి వెనుక ఒకరు పరిగెత్తుతున్నట్లు ఫోటోలు తీసుకున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వీరిపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఓవైపు విమర్శలు... మరోవైపు మద్దతు...
హనీమూన్ ఫోటోషూట్ చేసుకుంటే చేసుకున్నారు... కానీ వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. ఇలా దుస్తులు లేకుండా,కేవలం బెడ్ షీట్ చుట్టుకుని ఫోటోషూట్స్లో పాల్గొనడమేంటి... ఇదేం ట్రెండ్ అని ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి ఈ వ్యవహారం నచ్చక... కొంతమంది బంధువులు సైతం రిషి-లక్ష్మి జంటను తమ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్ నుంచి తొలగించారు. చాలామంది నెటిజన్లు ఆ ఫోటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయాలని కోరారు. అయితే ఆ జంట మాత్రం అందుకు నో చెప్పింది. తామేమీ దుస్తులు లేకుండా ఫోటోషూట్లో పాల్గొనలేదని... బహిరంగ ప్రదేశాల్లో ఎలా ఉండాలో తమకు బాగా తెలుసునని చెప్పింది.

హద్దులు దాటుతున్నారా...?
ఫోటోలను తొలగించడమంటే తాము తప్పు ఒప్పుకున్నట్లేనని.. కానీ తామెలాంటి తప్పు చేయలేదని రిషి-లక్ష్మి జంట తేల్చి చెప్పింది. అదే సమయంలో ఆ జంటకు మద్దతు కూడా పెరిగింది. ఆ ఫోటోషూట్ చాలా అందంగా ఉందని... అందులో అసభ్యత ఏమీ లేదని కొంతమంది వారికి మద్దతునిచ్చారు. విమర్శలను పట్టించుకోకుండా కొత్త కాపురాన్ని సంతోషంగా గడపమని సలహాలిచ్చారు. అయితే ఈ ఫోటోషూట్పై సమాజంలో రెండు స్పష్టమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకటి... మన సంస్కృతి,సంప్రాదాయాలను మంటగలిపేలా ఇలా రొమాంటిక్ ఫోటోషూట్స్ ఏంటని ప్రశ్నించేవారు కొందరైతే... కాలంతో పాటే మార్పు... అసభ్యతకు తావు లేనంతవరకు దేన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదనేవారు మరికొందరు.. ఏదేమైనా సమాజంలో భిన్నత్వం సహజం... అయితే అందరికంటే భిన్నంగా ఉండాలనే తాపయత్రంలో హద్దులు దాటడం కూడా మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications