బోనాల పండగ విశిష్ఠత ఏంటి, ఎలాంటి పూజలు చేయాలి
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ఆషాఢ మాసంలో ఈ నెలంతా ప్రాంతాలవారిగా బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. దీనికి ప్రారంభ సూచనగా జూన్ 30న గోల్కొండ బోనాలు నిర్వహిస్తారు. బోనాలు అనేది హిందువులు మహంకాళిని మరియు ఇతర గ్రామ దేవతలను ఆరాధిస్తూ జరుపుకునే పండుగ. దీనిని ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటారు. ఆషాఢ మాసములో జరుపుకునే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసములో కూడా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు.
బోనం :- బోనం అనే పదం భోజనానికి మరో రూపమని భావిస్తారు. ప్రజలు అమ్మవారికి బోనం రూపంలో నైవేద్యాన్ని సమర్పిస్తారు. పాలు మరియు బెల్లంతో కలిపి వండిన అన్నాన్ని రాగి / ఇత్తడి లేక మట్టి కుండలలో పెట్టి, ఆ కుండలను పసుపు, కుంకుమలు మరియు వేప మండలతో అలంకరిస్తారు. ఈ మధ్య వీటికి ఆధునిక అలంకరణలు కూడా చేస్తున్నారు. కొంత మంది ఈ కుండలపై దీపాన్ని కూడా వెలిగిస్తారు. ఇలా అలంకరింపబడిన కుండను బోనం అని పిలుస్తారు.
పట్టు చీరలతో సాంప్రదాయబద్ధంగా తయారైన స్త్రీలు ఈ బోనాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుడు, ఆట పాటలతో ఊరేగింపుగా వెళ్లి చీరె, గాజులు, పసుపు కుంకుమలతో పాటు గుడిలో అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా బోనం తలకెత్తుకుని వెళ్లే మహిళలను అమ్మవారి అంశగా భావిస్తారు. రౌద్రానికి ప్రతీక అయిన అమ్మవారిని శాంత పరచడానికి దారి పొడుగునా భక్తులు వారి కాళ్లపై నీళ్లు పోస్తుంటారు. ఇలా దాదాపు అన్ని గ్రామదేవతల గుడులలో బోనం సమర్పించటమనే ఆచారాన్ని పాటిస్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, ఆంకాళమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ మరియు మారెమ్మ మొదలైన అన్ని దేవతల గుడులు ఈ సమయానికల్లా కొత్త రంగులతో, విద్యుత్ దీప కాంతులతో, శోభాయమానంగా ముస్తాబవుతాయి.
బోనాల ఉత్సవాలు ఎలా ప్రారంభమయ్యాయి :- బోనాల ఉత్సవాలు 18వ శతాబ్దంలో ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు భావిస్తారు. 1813 సంవత్సరంలో జంట నగరాలలో కలరా వ్యాధి ప్రబలడంతో వేలాది మంది ప్రజలు చనిపోయారు. ఈ వ్యాధి ప్రబలడానికి ముందే ఒక సైనిక బెటాలియన్ ను ఉజ్జయినికి పంపించారు. ఆ బెటాలియన్ లోని వ్యక్తులు ఇక్కడి కలరా వ్యాధిని గురించి తెలుసుకుని ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ లోని మహంకాళి దేవతను ప్రార్థించారు. ఆ అంటువ్యాధి తగ్గిపోతే నగరంలో మహంకాళి దేవత గుడిని నిర్మిస్తామని మొక్కుకున్నారు.
వారు తిరిగి వచ్చేసరికి వ్యాధి తగ్గిపోవటంతో మొక్కుప్రకారం ఆలయం నిర్మించి బోనాలు పండుగ జరుపుకున్నారు. సైన్యంలో పనిచేసిన సికింద్రాబాద్కు చెందిన సురిటి అప్పయ్య అనే అతను 1815 లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, కలపతో అమ్మవారి విగ్రహన్ని చేయించి, ఉత్సవాలు జరిపినట్లు ఆలయ నిర్వాహకులు చెబుతారు. అప్పటినుండి బోనాల పండుగ ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలలో భాగమైంది.
మరొక నమ్మకం ప్రకారం ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని భావిస్తారు. పుట్టింటికి వచ్చిన దేవతను సంతోష పరిచటానికి బోనాల పండుగను జరుపుతారు. ఈ పండుగకు ఆడపిల్లలను పుట్టింటికి పిలిచే సాంప్రదాయం ఇప్పటికీ ఉంది. కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను పెద్ద పండుగ, ఊర పండుగ మరియు ఊరడి అనే పేర్లతో కూడా పిలుస్తారు.
బోనాల ఉత్సవాలు :- బోనాల పండుగను జంట నగరాలలో వైభవంగా జరుపుకుంటారు. లంగర్ హౌస్ లో ప్రారంభమయ్యే ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసములో తొలి ఆదివారం గోల్కొండ మహంకాళి ఉత్సవాలు జరుగుతాయి. రెండవ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర, బల్కంపేట ఎల్లమ్మ జాతరలు జరుపుకుంటారు. మూడవ ఆదివారం పాత నగరం బోనాల జాతర అంటే లాల్ దర్వాజా సింహవాహిని, చిలకలగూడ మైసమ్మ, హరిబౌలి అక్కన్న మాదన్న, శాలిబండ ముత్యాలమ్మలకు మరియు నగరంలో మిగిలిన అనేక ప్రాంతాల్లో ఇదే రోజు బోనాల పండుగ జరుపుకుంటారు. తిథులను బట్టి ఒక్కొక్కసారి ఒక వారం అటూ ఇటూగ పండగ తేదీలు ఉంటాయి.