నేటి నుంచే కొత్త గోల్డ్ రూల్స్! పసిడికి పన్ను పోటు!
పసిడి ప్రియులకు, ఆభరణాల ఎగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. దేశంలోకి వెల్లువెత్తుతున్న అనవసర దిగుమతులకు అడ్డుకట్ట వేయడంతో పాటు, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యంగా కేంద్రం కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
ఆభరణాల ఎగుమతిదారులకు ఊరటనిచ్చే అడ్వాన్స్ ఆథరైజేషన్ (AA) పథకంపై ప్రభుత్వం తొలిసారిగా పరిమితులను విధించింది. గతంలో ఈ పథకం కింద ఎంత బంగారమైనా దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇకపై దాన్ని 100 కిలోల గరిష్ట పరిమితికి పరిమితం చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిసారి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారి తయారీ కేంద్రాలను అధికారులు స్వయంగా తనిఖీ చేస్తారు. ఒకసారి అనుమతి పొందిన తర్వాత, నిర్దేశించిన ఎగుమతి లక్ష్యంలో కనీసం 50 శాతం పూర్తి చేస్తేనే తదుపరి అనుమతులు మంజూరు చేస్తారు. అంతేకాకుండా, ప్రతి 15 రోజులకు ఒకసారి స్వతంత్ర చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ధృవీకరించిన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

భారీగా పెరిగిన సుంకాలు..
బంగారం, వెండిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 5% నుండి 10%కి, అగ్రి సెస్ (AIDC)ని 1% నుండి 5%కి ప్రభుత్వం పెంచింది. దీనివల్ల సమగ్ర దిగుమతి సుంకం 15 శాతానికి చేరింది. వీటికి అదనంగా 3% ఇంటిగ్రేటెడ్ GST (IGST) కూడా చెల్లించాల్సి ఉంటుంది. వెరసి, గతంలో 9.18%గా ఉన్న మొత్తం సుంకం భారం ఇప్పుడు 18.45%కి ఎగబాకింది. బంగారం, వెండితో పాటు ప్లాటినంపై కూడా సుంకాన్ని 15.4 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాణేలు, గోల్డ్ డోర్ వంటి అన్ని రూపాల్లోని పసిడికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.
రూపాయి పతనం.. పెరుగుతున్న దిగుమతి బిల్లు!
మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, దేశీయంగా బంగారం దిగుమతులు రికార్డు స్థాయికి చేరడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం, వెండి దిగుమతులు 26.7% పెరిగి 102.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 95.75 వద్దకు పడిపోయింది. రూపాయిని నిలబెట్టడానికి, అనవసర విదేశీ మారక ద్రవ్యం ఖర్చును తగ్గించడానికి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన కొద్ది రోజులకే ఈ కఠిన చర్యలు తీసుకోవడం గమనార్హం.
మార్కెట్పై ప్రభావం
ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశం భారత్. ఆభరణాల తయారీ కోసం మన దేశం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. తాజా సుంకాల పెంపుతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వ ప్రకటన తర్వాత రూపాయి విలువలో కొంత స్థిరత్వం కనిపించడం సానుకూలాంశం. పెరిగిన ధరల వల్ల సామాన్యుడిపై భారం పడినా, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు తప్పవని నిపుణులు విశ్లేషిస్తున్నారు.














Click it and Unblock the Notifications