భారత మాజీ సీజేఐకి రష్యా కీలక పోస్టు ..! ఉక్రెయిన్ తో మధ్యవర్తిత్వం..!
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJI)పనిచేసి పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud)కు అంతర్జాతీయంగా అరుదైన గౌరవ లభించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్దం (Russia-Ukraine War)నేపధ్యంలో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఆయనకు దక్కింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వం ఆయన్ను ఓ కీలక వివాదంలో మధ్యవర్తిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఓ అంతర్జాతీయ కేసులో భారతీయ న్యాయమూర్తి మధ్యవర్తిగా వ్యవహరించబోతున్నారు.
ఉక్రెయిన్ ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ ఓషాడ్బ్యాంక్ (Oschadbank) దాఖలు చేసిన భారీ పెట్టుబడి వివాదంలో రష్యా దేశం తరఫున ప్రతినిధిగా (ఆర్బిట్రేటర్) వ్యవహరించేందుకు మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వ్యవహారం అంతర్జాతీయ న్యాయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్పై రష్యా జరిపిన సైనిక చర్యల కారణంగా డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా వంటి సరిహద్దు ప్రాంతాల్లోని తమ ఆస్తుల్ని, వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా కోల్పోయామని ఓషాడ్బ్యాంక్ ఆరోపిస్తోంది. దీంతో ఈ భారీ నష్టానికి పరిహారం కోరుతూ 1998 నాటి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం కింద రష్యాపై దావా వేసింది.

దాదాపు వందల మిలియన్ డాలర్ల విలువైన ఈ కేసు విషయంలో జూలై 2025లో తాము పంపిన నోటీసులకు రష్యా స్పందించకపోవడంతో బ్యాంకు ఈ ఆర్బిట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో వివాద పరిష్కారానికి ముగ్గురు సభ్యుల ప్రత్యేక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. కోస్టారికాకు చెందిన మాజీ వాణిజ్య మంత్రి, అంతర్జాతీయ నిపుణురాలు ద్యాలా జిమెనెజ్ ఈ ట్రిబ్యునల్కు అధ్యక్షత వహిస్తారు. ఆమెను రష్యా , ఉక్రెయిన్ బ్యాంకు రెండు కలిసి పరస్పర అంగీకారంతో సంయుక్తంగా ఎంపిక చేసుకున్నాయి. ఇక గ్రీస్కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ స్టావ్రోస్ బ్రెకౌలాకిస్ను ఉక్రెయిన్ బ్యాంకు తన ప్రతినిధిగా ఎంపిక చేసింది. వాస్తవానికి గతంలోనూ రష్యా ఇలాంటి పలు వ్యవహారాల్లో జస్టిస్ చంద్రచూడ్ను సంప్రదించినా.. ఆయన ఆ ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించారు. ఈసారి మాత్రం మధ్యవర్తిత్వానికి అంగీకరించారు.














Click it and Unblock the Notifications