కాబోయే సీజేఐ ఎవరో తెలుసా ? డీవై చంద్రచూడ్ ఓటు ఆయనకే..!
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్ధానంలో తదుపరి ఛీఫ్ జస్టిస్ గా ఎంపికయ్యే వారిని ఆయన సిఫార్సు చేశారు. సుప్రీంకోర్టులో ఉన్న ఆనవాయితీ ప్రకారం రిటైర్ అవుతున్న ఛీఫ్ జస్టిస్ తన స్ధానంలో కూర్చోబోయే వారి పేరును సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఏదైనా పెద్ద అభ్యంతరం ఉంటే తప్ప వారే ఛీఫ్ జస్టిస్ కావడం సంప్రదాయం.
ప్రస్తుతం సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ గా ఉన్న డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10తో ముగియనుంది. సుప్రీంకోర్టు జడ్జీల 65 ఏళ్ల పదవీకాలం నిబంధన ప్రకారం చంద్రచూడ్ నవంబర్ 10న రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తన స్ధానంలో తదుపరి ఛీఫ్ జస్టిస్ గా ప్రస్తుత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రతిపాదించారు. ఆయన పేరును కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదిస్తూ చంద్రచూడ్ ఓ లేఖ రాశారు.

కేంద్ర న్యాయశాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేస్తే కొత్త ఛీఫ్ జస్టిస్ గా నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపడతారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కెరీర్ ప్రారంభించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఢిల్లీ తీస్ హజారీ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. తర్వాత ఢిల్లీ హైకోర్టుతో పాటు పలు ట్రైబ్యునల్స్ లోనూ పనిచేశారు. ఐటీ శాఖతో పాటు ఢిల్లీ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గానూ సేవలందించారు.
2005లో ఢిల్లీ హైకోర్టు జడ్డిగా బాధ్యతలు చేపట్టిన సంజీవ్ ఖన్నా.. 2006లో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. ఢిల్లీ జ్యుడిషియల్ అకాడమీ ఛైర్మన్ గా, ఢిల్లీ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్, ఢిల్లీ జిల్లా కోర్టుల మీడియేషన్ సెంటర్లలోనూ చైర్మన్, ఇన్ ఛార్జ్ జడ్జిగా వ్యవహరించారు. 2018 జనవరి 18న సుప్రీంకోర్టు జడ్డిగా ప్రమోట్ అయ్యారు. ఏ హైకోర్టులోనూ ఛీఫ్ జస్టిస్ గా పనిచేయకుండానే ఆయన సుప్రీంకోర్టు జడ్డిగా నియమితులవ్వడం విశేషం. కేంద్రం ఢిల్లీలో నిర్మించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కేసుతో పాటు ఆర్టికల్ 370, ఎన్నికల బాండ్లు రద్దుచేసిన రాజ్యాంగ ధర్మాసనాల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications