ఈ రోజు ఏరువాక పూర్ణిమ
అన్నదాతలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ఈనాటి తిథి వివరణకు సంబంధించి వృషభ పూజ, హల ప్రవాహ వంటి పదాలు ఉన్నాయి. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే ఈ పండుగను రైతన్నలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్షఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి.
కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను రంగులు, రకరకాల బట్టలతో అంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగించారు. ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.
"మంత్ర
యజ్ఞపరా
విప్రా
సీయజ్ఞాశ్చ
కర్షకా:
గిరి
యజ్ఞస్థథా
గోపా:
ఇజ్యోస్మాభిర్గిరిర్వనే"
అని శ్రీకృష్ణ పరమాత్మ గోపాలురకు గిరియజ్ఞము, కర్షకులకు ఏరువాక యజ్ఞముగా, బ్రాహ్మణులు మంత్రజపమే యజ్ఞముగు చేయుదురని తెలుపగా, విష్ణుపురాణము దీనిని ఏరువాక సీతాయజ్ఞమని పేర్కొంటోంది.
ఈ ఏరువాక పండుగ అతి ప్రాచీనమైంది. పూర్వము శ్రీ కృష్ణదేవరాయ సార్వభౌముడు రైతన్నల కృషిని అభినందించి తగిన రీతిలో రైతు సోదరులను ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ.. ఒక బంగారు రంగు నాగలిని కర్షకులకు అందించినట్లు గాథలున్నాయి.
ఒకప్పుడు ప్రతీ సంవత్సరం కనిపించే ఈ సంప్రదాయ పండుగ ఇప్పుడు మెల్లగా కనుమరుగవుతోంది.