భారత్ లో 30 డేస్ టూర్.. రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ కపుల్.. నెటిజన్లు షాక్..!
భారతదేశంలో ఎన్నో ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు ఎన్నో విశిష్టమైన ప్రదేశాలకు నిలయంగా మనదేశం ఉంది. భారత్ లోని వింతలు, విశేషాలను చూసేందుకు విదేశాల నుంచి నిత్యం వేలాది సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. పొరుగు దేశాల నుంచే కాకుండా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జపాన్ నుంచి కూడా అనేక మంది పర్యాటకులు మనదేశానికి వస్తుంటారు. అయితే ఇటీవల అమెరికాకు చెందిన ఓ జంట భారత్ లో 30 రోజులపాటు సందర్శించింది. అందుకోసం ఆ జంట ఏకంగా రూ. 10 లక్షలు ఖర్చు చేసింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ఈ అమెరికన్ జంట రాయల్ టూర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికాలోని చికాగోకు చెందిన ఈ జంట కేవలం 30 రోజుల్లోనే రూ. 10 లక్షలు ఖర్చు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత్ లోని 13 నగరాలను అలెక్స్, అమేలియా అనే ఈ జంట సందర్శించింది. అలా రోజుకు యావరేజ్ గా రూ. 33వేలు ఖర్చు చేసింది. ఈ వివరాలను తమ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది ఈ జంట. 30 రోజుల్లో 13 నగరాలను సందర్శించేందుకు వాళ్లు 6 డొమెస్టిక్ విమానాలు, 6 ప్రైవేట్ కారు ప్రయాణాలు, 2 సార్లు రైలు ప్రయాణాలు చేశారు. ఇలా ట్రావెలింగ్ కే ఎక్కువ ఖర్చు అయినట్లు ఆ జంట పేర్కొంది.

ఈ పర్యటనలో తాము అనుకున్నదానికంటే ఎక్కువగానే ఖర్చు అయినట్లు ఆ జంట పేర్కొంది. లగ్జరీ వసతులు, ప్రీమియం అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించింది. బడ్జెట్ హోటల్స్ లో కాకుండా మిడ్ టూ హై రేంజ్ హోటల్స్ లో బస చేసినట్లు పేర్కొంది. దీనికోసం రోజుకు సగటున రూ. 12 వేలు ఖర్చు అయినట్లు స్పష్టం చేసింది. అలాగే స్ట్రీట్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ప్రతిరోజూ మంచి రెస్టారెంట్స్ లోనే తిన్నామని తెలిపింది. వీటితోపాటు ప్యాలెస్ టూర్లు, ప్రైవేట్ గైడ్ లు, ఆటో రైడ్స్ .. తదితర వాటికోసం భారీగానే ఖర్చు చేసినట్లు ఈ జంట చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు వారిని సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications