నాగుల చవితి: ఈ పనులు చేస్తే సర్వరోగాలు మటుమాయం!!
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో ముఖ్యమైంది నాగుల చవితి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జరుపుకునే పండుగ నాగుల చవితి. పుట్టలకు పూజలు చేసి, నాగ దేవతకు పాలు పోసి ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈరోజు పూజలు చేస్తే సర్వ రోగాలు మాయమవుతాయని, సకల పాపహరణం జరుగుతుందని భక్తులు విశేషంగా నమ్ముతారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధించి పుట్టలో పాలు పోసి తాము, తమ కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో నాగదేవతను పూజిస్తారు. పుట్టల దగ్గర శుభ్రం చేసి, నీళ్లు చల్లి, ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి, పూలతో అలంకరించి, పుట్టలో పాలు పోసి నాగదేవతకు నమస్కరించుకుంటారు.

నాగుల చవితి రోజున నాగదేవతను పూజించేవారికి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, రోగాల బారి నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. నాగుల చవితి రోజున నాగదేవతను శివ భావంతో అర్చిస్తే ఆరోగ్యం కలుగుతుందని చెబుతారు. సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా భావించి పూజించే గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతిలో విశిష్ట లక్షణమని అందులో భాగంగానే నాగదేవతను పూజిస్తూ వస్తున్నామని చెబుతారు.
ఇక నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, పూజా మందిరంలో కలశాన్ని ఏర్పాటు చేసి, దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని, నాగేంద్ర స్వామి ప్రతిమను కానీ ఫోటోలు కానీ, పడగను కానీ పెట్టి పూజ చేసుకోవాలి.
పూజకు ఎర్రని పూలు ఉపయోగించాలి. స్వామి దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి. ఇంట్లో పూజ ముగించిన తర్వాత పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోయాలి. పుట్ట వద్ద దీపం వెలిగించి పూజ చేయాలి. పూజ పూర్తి చేసిన తర్వాత పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. నాగుల చవితి నాడు నాగదేవతకు పంచామృతాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని చెబుతారు.












Click it and Unblock the Notifications