Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రావణ "జంధ్యాల'' పూర్ణిమ

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి , జప , అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతము అనే పదము 'యజ్ఞము' 'ఉపవీతము' అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే 'యాగము' 'ఉపవీతము' అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగకర్మ చేత పునీతమైన దారము అని అర్థము.
యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాననే జంధ్యమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు.

శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి. ఇది వేదాధ్యయానికి సంబంధించినది. ప్రాచీన సంస్కృత నిఘంటువైన 'అమరకోశాన్ని' రచించిన అమరసింహుడు 'సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శ్రుతేః' అన్నాడు. సంస్కారం అంటే ఉపనయనం, వేదాన్ని అధ్యయనం చేయడం 'ఉపాకరణం'. సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ. మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి. సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాటవాలను, జ్ఞానాన్ని ఉపదేశించి ఉపదేశిస్తాడు. ఉపనయన సంస్కారం పొందినవారిని 'ద్విజుల' అని అంటారు.

	raksha bandhan also sravana purnima in astrology

ఉపనయన సందర్భంలోనే యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఎడమ భుజంపైనుండి ధరిస్తారు కాబట్టి దీనిని ఉపవీతమంటారని అమరకోశం చెబుతుంది. ఉపనయనం చేసుకుని జంధ్యాన్ని వేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు, గాయత్రీ పూజ చేయుటకు, ఇతర పూజలు చేయుచుటకు అర్హుడవుతాడు. యజ్ఞోపవీత ధారణకు అర్హులైనవారందరూ ఈ రోజు పాత జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) ధరించవలెను. 'సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్ తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి సృతమ్' బ్రహ్మతత్వాన్ని సూచించడానికి, వేద తత్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని ( యజ్ఞోపవీతాన్ని ) ధరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే ఉపవీతము అంటే రక్షణ వస్త్రం.

యజ్ఞోపవీతాన్ని శిఖనూ తప్పని సరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. అందుకే ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినవారు అని, ఒకటి అమ్మ కడుపు నుంచి పుట్టడం జన్మ అయితే, ఈ గాయత్రి దేవిని ఉపాసించి యజ్ఞోపవీతం ధరిండం ఆ తల్లి అనుగ్రహం పొందడం రెండవ జన్మ అన్నమాట. ఋగ్వేదులైనవారు శ్రావణమాసంలో ఏ రోజు శ్రవణా నక్షత్రం ఉంటుందో ఆ రోజే ఆచరించాలి. యజుర్వేదులకు పౌర్ణమి ప్రధానం. వారు పౌర్ణమినాడు దీన్ని ఆచరిస్తారు. సామవేదులు మాత్రం హస్తా నక్షత్రము రోజున ఆచరించవలసి వుంటుంది. ఇలా ఆయా వేదాలు వారు వారికి నియమించిన తిథి నక్షత్రాలను బట్టి ఉపాకర్మను ఆచరిస్తారు.

ఆదిదేవుడు , సర్వమంగళా ( పార్వతీ )పతి, సర్వమంగళ కారకుడైన శివుడు కూడా మంగళం కలిగేందుకు ఉపవీతాన్ని ధరిస్తాడని యజుర్వేదంలోని 'నమో హరి కేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః' అనే మంత్రం మనకు చెబుతోంది. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని, యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో అనగా తొమ్మిది దారపు పోగులతో నిర్మించాలని, ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం. మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులవో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలూ ఉంటారు.

యజ్ఞోపవీతం తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని వశిష్ఠస్మృతి ప్రమాణంగా తెలియజేసింది. నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించారు. ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే తొంభై ఆరు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్ని, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను, ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. బాలురకు ఒంటి ముడి వున్న అంటే మూడు పోగుల జంధ్యాన్ని ధరింపజేస్తారు. ఈ మూడు పోగులు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు.

బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమినాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. పూర్వం వేదాధ్యయనాన్ని ప్రారంభ దినంగా శ్రావణ పూర్ణిమను పరిగణించేవారు. వేద విద్యార్థులు, అధ్యాపకులు, గృహస్థులు నిత్య కర్మలు ముగించుకుని గాయత్రీ జపాలు చేస్తారు. ఈ రోజున తప్పనిసరిగా నూతన యజ్ఞోపవీతాలను ధరించాలి. జంధ్యాల పౌర్ణమిగా శ్రావణ పూర్ణిమ అలా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున మంత్రదష్టలైన సప్తఋషులను పూజించాలి. జంధ్యంలోని బ్రహ్మముడులను అరచేతిలో ఉంచుకుని గాయత్రీ జపం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఉపాకర్మలోని విశేషం ఇది.

ఇంతటి మహిమాన్వితమైన యజ్ఞోపవీతాన్ని మొట్టమొదటగా బ్రహ్మ తయారుచేశాడంటారు. అలా బ్రహ్మ తయారు చేసిన జంధ్యాన్ని శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టాడని, లయకారుకుడు సకల శుభకరుడైన రుద్రుడు ముడివేశాడని అంటారు. ఆ తర్వాత సకల సౌభాగ్యదాయిని, సకల జ్ఞానరాశి అయిన సావిత్రీదేవి అభిమంత్రించింది. దానివల్లనే ఈ యజ్ఞోపవీతానికి అంతటి పవిత్రత చేకూరింది.
యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ముందు ఆచమనం, సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత యజ్ఞోపవీతాన్ని పూజించాలి. ఆ తర్వాత రెండు చేతుల యొక్క బొటనవ్రేళ్లతోనూ, యజ్ఞోపవీతాన్ని చేసుకుని 'యజ్ఞోపవీతం పరమం పవిత్రం' అనే శ్లోకాన్ని పఠించి, మొదటి కుడిచేయి ఉంచి ముడి ముందుగా వచ్చునట్లుగా ధరించాలి.

నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన తర్వాత పాత యజ్ఞోపవీతాన్ని క్రిందకు వదలాలి మొదట కుడికాలు తీసి చివరగా ఎడమ కాలు నుండి తీసి వేయాలి. అశౌచాలవలన, ఆప్తుల జనన, మరణ సమయంలో, గ్రహణం పట్టి వదిలిన తర్వాత ఇతర అమంగళాలు కల్గిన సందర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. ఉపాకర్మ సందేశం ఉపాకర్మ సామూహికంగా ఆచరించే కర్మ. అన్ని రోజులలో ఎవరి కార్యక్రమాలలో హడావుడిగా వుంటారు. ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అందరూ ఒకచోట చేరి సామూహికంగా పూజాదులు నిర్వహించడంవల్ల సమిష్టితత్వం పెరుగుతుంది. నదీతీరాలలో ఆచరించే స్నానాదులవల్ల నదులను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన పెంపొందుతుంది. శారీరక , మానసిక పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమ్ దివ్యౌషధమని పెద్దలు చెబుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+