శ్రీ దుర్ముఖి: మూడు మూఢాలు, ఏం చేయాలి?
శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వ దోషాపహం
అభ్యంగాస్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం
ఆయుర్వర్థన ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం
నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మూకర్ణ్యతాం
ఉగాది - కాలపురుషునికి సంబంధించిన ఉత్సవం. కాలం అవ్యవహితమైంది. వ్యక్తి జీవిన అవసరాలకు వీలుగా దానిని వ్యవహితం చేసుకునే ప్రక్రియలో అనేక విధాలుగా దాన్ని విభజించుకుంటూ ఉన్నాడు. కాలాన్ని గమనించే విధానంలోనే వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనస్సే అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించారు. జ్యోతిషం ప్రకారం చంద్రుడు మనస్సుకు కారకుడు. చాంద్రమానంలో పూర్ణిమ నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసాల పేర్లు పెట్టబడుతుంటాయి. చిత్త పూర్ణిమ నాడు వస్తే చైత్రం. విశాఖ -పౌర్ణిమ నాడు వస్తే వైశాఖం... ఇలా రాని సమయంలో అధిక మాసం లేదా క్షయమాసాలు మనకు వస్తూంటాయి. వైదిక మంత్రాలలోనే ఈ మాసాల ప్రసక్తి మనకు కనిపిస్తూందంటే ఎంతో కాలానికి పూర్వమే సౌర, చాంద్రమానాల వినియోగం మనవారు చేసేవారని మనకు స్పష్టమౌతోంది.
గ్రహాలలో శని ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 30 సంవత్సరాలు, గురుడు తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఈ రెండింటి కనిష్ట సామన్య గుణిజం 60 కావడం వల్ల చాంద్రమానంలోని సంవత్సరాలు కూడా 60గా ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలను మళ్ళీమనం సంవత్సర, పరివత్సర, ఇడావత్సర, ఇద్వత్సర, అనువత్సరాలనే భాగాలు చేస్తే అది పంచవర్షాత్మక యుగంగా చూసుకుంటే 60 సంవత్సరాలు మళ్ళీ 12 విభాగాలుగా కనిపిస్తాయి.
యుగ్మమంటే జంట. శరీరంలోకాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలు, చెవులు, ళ్ళు మొదలైన జ్ఞానేంద్రియాల జంటలు పనిచేసినప్పుడే స్పష్టమైన సమాచారాన్ని సేకరించగలుగుతున్నాం. కాలంలోనూ రాత్రింబవళ్ళు, ఆయనాలు అన్నీ జంటగానే కనిపిస్తాయి. అదేవిధంగా అధికమాసాలలో జంట ఏర్పడే ఐదు సంవత్సరాల కాలానికి పంచవర్షాత్మక యుగమని పేరు పెట్టబడింది. ఆ తర్వాత కాలంలో యుగమనేది జంట అర్థం నుండి కాలార్థంగా మార్చబడింది. ఉగాది అనేది యుగాది. ఇది కాల ప్రమాణంలో సంవత్సర కాలానికి ప్రారంభమైన అంశం. ఈ ప్రారంభాన్ని తెలుగువారంతా చక్కని పండుగగా ఆచరిస్తారు. ఆరోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వసంత ఆగమనోత్సవ వేడుకలను నిర్వహించే ఈ ఉత్తమమైన రోజున ఎన్నో శుభసూచకాలు కావాలని కోరుకుంటారు.

అనేక ధర్మశాస్త్ర గ్రంథాలు, వ్రత గ్రంథాలు ఉగాది నాడు వైజ్ఞానికంగా చేయవలసిన పనులును నిర్దేశించాయి.
1. ప్రతి గృహ ధ్వజారోహణం
2. తైలాభ్యంగం
3. నవవస్త్రాభరణధారణం
4. దమనేన బ్రహ్మపూజనము
5. సర్వాపచ్ఛాంతకర మహాశాంతి, పౌరుష ప్రతిపత్ వ్రతము
6. నింబకుసుమ భక్షణం
7. పంచాంగంపూజ, పంచాంగ శ్రవణం
8. ప్రసాదాన ప్రారంభం
9. రాజదర్శనం
10. వాసంత నవరాత్రి ప్రారంభం
ఈ విధంగా అనేకాంశాలు యుగాది నాడు చేయవలసిన కృత్యాలలో కనిపిస్తుంటాయి.
తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నిర్వహించే కార్యక్రమాలలో ఉగాది పచ్చడి, పంచాంగ ప్రశణాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి.
నింబకుసుమ భక్షణం (వేపపూవు పచ్చడి తినడం) : ఋతు సంబంధమైన పండుగ ఉగాది కావడం వల్ల తప్పనిసరిగా వేపపూవు పచ్చడి తినాలని చెప్పడం జరిగింది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ తెల్లవారి మామిడి పువ్వును తినాలని, ఉగాది నాడు వేపపూవు తినాలని చెప్పడం వల్ల ఆరోజున ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేసి తినడం ఆనవాయితీ.
వర్షాదౌ భక్షణం శర్కరామ్ల ఘృతైర్యుతం
భక్షితం పూర్వయామేస్యాత్తద్వర్షం సౌఖ్యదాయకమ్ - అని చెప్పడం జరిగింది. ఉగాది నాడు ఆ సంవత్సరపు వేపపువ్వు. చక్కెర (బెల్లం), చింతపండు, నెయ్యి కలిపి మొదటి జాము నందే తింటే ఆ సంవత్సరమంతా సుఖంగా జరుగుతుందనే నమ్మకం మన తెలుగువారిది.
పంచాంగ శ్రవణం: తిథి వార నక్షత్రాదులతో కూడుకున్న పంచాంగాన్ని ఆరోజు వినడం వల్ల ఆ సంవత్సరాన్ని ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పంచాంగశ్రవణం తప్పనిసరి ప్రక్రియగా ఉపయోగించ బడుతున్నది. సంవత్సరం ప్రారంభంలో సంవత్సర విశేషాలను అధ్యయనం చేస్తే సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలుంటాయని, దానికోసం ఈ విషయం ఆచరణలో ఉంది.
పంచాంగాన్ని గూర్చి తెలుసుకోవడమంటే సంవత్సర సంబంధమైన అంశాల్లో ముందు జాగ్రత్తకోసం ప్రయత్నం చేస్తున్నట్లే. వర్షాలు పడే విధానం, భూములు పండే విధానం, ఏ ధాన్యాల విలువలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం, యుద్ధాలు, ఇబ్బందులు, పశుసంపద... ఒకటేమిటి ప్రతి అంశానికి సంబంధించిన విశేషలను సంవత్సర ప్రారంభం రోజున తెలుసుకోవడం ద్వారా ఆ సంవత్సరంలో ఎలా మెలగాలో నిర్ణయించుకోవడం ఇందులో కనిపిస్తుంది. ఇది అన్ని వర్గాలవారికి ఒక యియర్ ప్లానర్ వంటిది.
పంచాంగాలు అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. భూమి నుండి ఆకాశంలోని సూర్య, చంద్రాదుల దూరాలను గణించి వానికి సంబంధించిన వివరాలను అందించే ఒక విజ్ఞాన సర్వస్వం మన పంచాంగం. ఒక రకంగా ఆకాశాన్ని అరచేతుల్లో చూపిస్తుంటుందీ పంచాంగమే. దీని ఆధారంగా మన నిత్య నైమిత్తిక కామ్య కర్మలనన్నింటినీ నేరవేర్చుకుంటాం.
తిథేశ్చ శ్రియమాప్పోతి వారాదాయుష్యవర్ధనం
నక్షత్రాత్ హరతేత్పాపం యోగాద్రోగ నిరవారణం
కరణం కార్యసిద్ధించ పంచాంగ ఫలముత్తమం
కాలవిత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్ - అంటూ తిథి శ్రేయస్సును, వారం ఆయుష్షును, నక్షత్రం పాప నివారణను, యోగం, రోగనివారణను, కరణ కార్యసిద్ధిని కలిగిస్తాయి.
బ్రహ్మాయుర్ధాయాన్ని మనం నిత్యం స్మరిస్తూనే అంటాం. అద్య బ్రహ్మణ: ద్వితీయ పరార్ధే... శ్వేతవరాహకల్పే, నైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, అస్మిన్ వర్తమానేన వ్యవహారీక చంద్రమానేన స్వస్తిశ్రీ జయ నామ సంవతస్సరే, చైత్రమాసే, శుక్షపక్షే, ప్రతిపద్యాం, ఇందువాసరే... ఈ వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచిన తరువాత 28వ మహాయుగంలో కలియుగంలో ఇప్పటికి 5114 సంవతర్సరాలు గడిచి ప్రస్తుతం 5115 వ సంవత్సరంలో ఉన్నాం.
అవ్యవహితమైన కాలాన్ని మన అవసరాలకు చాంద్రమాన రీత్యా విభజించుకున్న 60 సంవత్సరాల ప్రమాణ కాలంలో 5 సంవత్సరాలకు ఒక యుగంగా విభజించినపుడు మొత్త 12యుగాలవుతాయి. వానిలో ప్రస్తుతం 6వ యుగం అహిర్భుధ్యృ (శివ) దేవతాకమైనది జరుగుతున్నది. ఈ యుగంలో ఉండే ఐదు వత్సరాలలో ఈ సంత్సరం పేరు జయ నామ సంవత్సరం వరుసలో ఇది 28 వ సంవత్సరం. పంచవర్షాత్మక యుగంలో ఇది చంద్ర దేవతాకమైన ఇదావత్సరం ఈ వత్సరంలో వస్త్ర దానాదులు అందరికీ శుభ ఫలితాన్ని పుణ్య బలాన్ని కలిగిస్తుంది.
కర్తరీ సమయము
వైశాఖ శుక్ల పంచమీ బుధవారం (04.05.2016) నుండి డొల్లు కర్తరి. తదాది (11.05.2016) వైశాఖకృష్ణ సప్తమి శనివారము (28.05.2016) వరకు నిజకర్తరీ.
మౌఢ్య సమయములు
చైత్ర కృష్ణ అష్టమీ శనివారము 30.04.2016నుండి ఆషాఢ శుక్ల సప్తమీ సోమవారము 11.07.2016 వరకు శుక్రమౌఢ్యము.
భాద్రపద శుక్ల దశమి సోమవారము 12.09.2016 నుండి ఆశ్వయుజ శుక్ల అష్టమీ ఆదివారము 09.10.2016 వరకు గురుమౌఢ్యము.
ఫాల్గుణ కృష్ణ సప్తమి ఆదివారము 19.03.2017 నుంచి చైత్ర శుక్ల తదియ మంగళవారము 30.03.2017వరకు శుక్ర మౌఢ్యము.
పుష్కరములు
ఆషాఢ కృష్ణ ద్వాదశీ ఆదివారం 31.07.2016 నుండి గోదావరీ నదీ అంత్యపుష్కరముల ప్రారంభమయి శ్రావణ శుక్ల అష్టమీ గురువారం 11.08.2016 నాడు పూర్తి అగును.
శ్రావణ శుక్ల నవమీ శుక్రవారం 12.08.2016నుండి సార్థ త్రికోటి తీర్థ సహిత కృష్ణా నదీ పుష్కరములు ప్రారంభమయి శ్రావణ కృష్ణ షష్ఠీ మంగళవారం 23.08.2016 నాడు పూర్తి అగును.
మకర సంక్రాంతి పురుషఫలమ్
ద్విముఖం కృష్ణవర్ణం చ సురూపం చ త్రినేత్రకమ్ |
చతుర్వక్త్రం చాతి శీర్షం లమ్బభ్రూ దీర్ఘనాసికమ్ ||
లంబకర్ణం రక్తదంతం మహాఘోర విరూపిణమ్ |
అష్టబ్రహుం త్రిపాదం చ శ్యామం చ త్వజవాహనమ్ ||
దశ యోజన మౌన్నత్యం ద్వాదశ స్మృతమ్ |
ఏవం రూపం తు విజ్ఞేయం సంక్రాన్తి పురషస్య హి ||
ఈ సంక్రాంతి పురుషనకు ''రాక్షస'' అను పేరు. ఈ సంక్రాంతి పురుషుడు నిర్మలమైన నీటిచే స్నానము చేసి, నల్లని, వస్త్రములను ధరించి లాక్ష గంధమును పూసుకొని, చంపక పుష్పమును మరియు గోమేధికముతో కూడిన ఆభరణములను ధరించినవాడై సీసపాత్రలో క్షీరమును సేవించి రేగిపండ్లను ఫలహారముగా తీసుకొని, ఏనుగు వాహనము ఎక్కి ధనుస్సును మరియు బంగారువర్ణము గల గొడుగును ధరించి ఆగ్నేయ దిక్కుగా ప్రయాణము చేయుచూ ఆశ్చర్యముతో కూడినవాడై కూర్చుని యుండును.
సంక్రాంతి పురుషుని ఈ రకమైన స్థితి వలన అందరకు కీడు లుగును. ప్రజలకు, ముఖ్యముగా ఆగ్నేయదిశలోని దేశాలలోని వారికి అంతటా శుభములు జరుగుచున్నను భయములు, ఘర్షణలు మాత్రము పెరుగును. కీర్తి సంపాదించుకుందురు. పశువులచే హాని పెరుగును. సీస లోహమునకు విలువ తగ్గును. బంగారమునకు విలువ బాగా పెరుగును. ప్రజలకు ఆహారలోపములచే అనారోగ్యములు పెరుగుచున్నను సుఖముగానే ఉందురు. పరిపాలకులకు అంతర్గత, బహిర్గత ఘర్షణలు పెరుగుతాయి. అయినను మొత్తం మీద అందరకు క్రమశుభాభివృద్ధి అందగలదు.
పక్షఫలమ్
శ్లో|| కృష్ణపక్షే యదా పౌషే మకరస్థే దివాకరే |
సుభిక్షం క్షేమ మారోగ్యం జంతూనా మశుభప్రదమ్ ||
పుష్య కృష్ణమున మకర సంక్రాంతి అగుట వలన దేశము సుభిక్షముగాను, క్షేమముగాను, ఆరోగ్యముగాను ఉండును. జంతువులకు నాశనము కలుగును. తిథిఫలం : సుభిక్షము, వారఫలం : అంతర్గత యుద్ధములు కలుగును. నక్షత్రఫలం : అనిష్టములు, లగ్నఫలం : జనకాషయము, కాలఫలం : అధికారులకు హాని.












Click it and Unblock the Notifications