కోస్తా ఆంధ్రాకు వరద గండం! ఎల్ నినో సృష్టించనున్న వాతావరణ బీభత్సం
దేశ ఆర్థిక వ్యవస్థకు, కోట్ల మంది రైతులకు జీవనాధారమైన నైరుతి రుతుపవనాలపై 'ఎల్ నినో' (El Nino) రక్కసి నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుత 2026 సంవత్సరంలో దేశంలో బలహీనమైన రుతుపవనాలు ఏర్పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల సంభవించే ఈ వాతావరణ దృగ్విషయం కారణంగా.. దేశవ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు, వడగాలులు, పంట నష్టాలు మరియు అసమాన వర్షపాతం వంటి సవాలుతో కూడిన పరిస్థితులు తలెత్తే ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది.
ఐఎండీ విడుదల చేసిన మొదటి దీర్ఘకాల రుతుపవనాల నివేదిక ప్రకారం.. జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే వర్షపాతం దీర్ఘకాల సగటు (LPA) లో కేవలం 92 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది రుతుపవనాలను వాతావరణ శాఖ "సాధారణం కంటే తక్కువ" వర్గంలో చేర్చింది. గతంలో దేశంలో తీవ్ర వర్షపాత లోటు (LPA లో 90% కంటే తక్కువ) ఏర్పడే సంభావ్యత కేవలం 16 శాతంగా మాత్రమే ఉండేది. కానీ, ఈ 2026 సీజన్లో ఆ ప్రమాదం ఏకంగా 35 శాతానికి పెరగడం నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, రుతుపవనాల మొదటి దశ (జూన్, జూలై ప్రారంభం) సాపేక్షంగా స్థిరంగా ఉన్నప్పటికీ.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్ నినో తీవ్రరూపం దాల్చి వర్షాలను ముఖం చాటేలా చేసే ప్రమాదం ఉంది.

ఏ ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం?
ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాతావరణ పంపిణీ తీవ్ర అసమానంగా మారనుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి వాయువ్య రాష్ట్రాల్లో రుతుపవనాల ద్వితీయార్థంలో తీవ్ర వర్షపాత లోటు ఏర్పడవచ్చు. అలాగే మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఉజ్జయిని, గ్వాలియర్, జబల్పూర్, సాగర్ వంటి ప్రాంతాలు పొడి వాతావరణాన్ని, వ్యవసాయ ఒత్తిడిని ఎదుర్కోనున్నాయి. గతంలోనే కరువుతో అల్లాడిన మహారాష్ట్రలోని మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక ప్రాంతాలు ఈసారి మరింత హానికరమైన పరిస్థితుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
దక్షిణ కోస్తాలో వరదల ముప్పు
చిత్ర విచిత్రమైన వాతావరణ మార్పుల వల్ల కొన్ని ప్రాంతాలు కరువుతో ఎండిపోతుంటే.. తమిళనాడు, కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు మాత్రం ఎల్ నినో ప్రభావంతో భారీ వర్షాలు, వరదలను ఎదుర్కొనే అవకాశం ఉంది. గతంలో 2015 ఎల్ నినో సంవత్సరంలో చెన్నై నగరాన్ని ముంచెత్తిన వినాశకరమైన వరదలే దీనికి నిదర్శనం.
గత చేదు జ్ఞాపకాలు.. రైతాంగానికి సవాల్
భారతదేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఖరీఫ్ సాగు కోసం నేరుగా రుతుపవనాలపైనే ఆధారపడతారు. గతంలో 2015-16 నాటి బలమైన ఎల్ నినో సమయంలో దేశంలో కేవలం 86 శాతం వర్షపాతమే నమోదై తీవ్ర నీటి కొరత, పశుగ్రాసం కొరత ఏర్పడింది. అలాగే 2023లోనూ ఆగస్టు నెలలో 36 శాతం వర్షపాత లోటు నమోదైంది. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అయితే రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోవడం, జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడం మరియు ఆహార ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు ఉంటుంది.
ఆశలు రేపుతున్న 'ఐఓడీ' (IOD)
ఈ తీవ్ర ఆందోళనల మధ్య వాతావరణ శాస్త్రవేత్తలు ఒక చిన్న సానుకూల అంశాన్ని కూడా గుర్తించారు. రుతుపవనాల తరువాతి దశలో సానుకూల హిందూ మహాసముద్ర డైపోల్ (Positive IOD) అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది గనుక బలపడితే, పశ్చిమ హిందూ మహాసముద్రం వేడెక్కి భారతదేశంపై వర్షాలకు సపోర్ట్ ఇస్తుంది. తద్వారా ఎల్ నినో వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని పాక్షికంగానైనా భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఐఎండీ ఈ మే (2026) చివరి నాటికి మరిన్ని ప్రాంతీయ వివరాలతో తుది నివేదికను విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా విపత్తు నిర్వహణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలతో సన్నద్ధమవుతున్నాయి.














Click it and Unblock the Notifications