చిన్నరాష్ట్రాలతో చింతలు అధికం
హైదరాబాద్: బలమైన కేంద్రం అంతకంటే బలంగా రాష్ట్రాలు వుంటేనే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. చిన్న రాష్ట్రాల అవసరం లేదని అధికార వికేంద్రీకరణ సవ్యంగా వుంటే చాలునని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చిన్న రాష్ట్రాలవల్ల సమస్యలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా నీరు-మీరు, క్లీన్ అండ్ గ్రీన్, అక్షరాస్యత, జన్మభూమి వంటి కార్యక్రమాలను తమ ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. సిద్ధాంతబలం కారణంగానే తమపార్టీ జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగే పరిస్థితికి ఎదిగిందని ఆయన చెప్పారు. కాగా హైదరాబాద్లో ఆయన వివిధ శాఖల అధిపతులు, సెక్రటరీ స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో కూడా పాల్గొన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి వివిధ సూచికలను ప్రమాణంగా తీసుకుని అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. గ్రామాలను యూనిట్గా తీసుకుని అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేస్తే వెనకబడిన ప్రాంతాల సత్వర అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన చెప్పారు.